రాష్ట్రస్థాయికి ఎన్నికైన శ్రీలత, అశోక్, దిగ్విజయ్, రవిరాజ్

మక్తల్, సెప్టెంబర్ 19, ( జనం సాక్షి న్యూస్)

క్రీడలు అంటే ఆ విద్యార్థులకు ఎంతో మక్కువ. చదువుతో పాటు చక్కగా క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఈనెల 18వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దేవుల తాండలో జరిగిన రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ ఎంపికలో ఆ విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని, ఎంపికైన విద్యార్థులలో మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన శ్రీలత, అశోకులు అక్క తమ్ముడు కాగా మరో ఇద్దరు క్రీడాకారులు దిగ్విజయ్ రవిరాజ్ లు ఉన్నారని టార్గెట్ బాల్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు నాయక్ తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయికి ఎన్నికైన ఇట్టి క్రీడాకారులు
ఈనెల 28 29 30 తేదీల్లో అచ్చంపేట పట్టణంలో నాగర్ కర్నూల్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు నాయక్ తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ నెలలో 10 నుండి 18 వరకు నేషనల్ రెఫ్రి క్లినిక్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర పట్టణంలో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎన్నికైన ఇట్టి విద్యార్థులను మక్తల్ మండలం లోని క్రీడాభిమానులు, నాయకులు ఎంతగానో అభినందించారు. తమ మండల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ తమ అసమాన ప్రతిభను కనబరిచి రాణించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.