రెండోరోజూ కొనసాగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన


-ఇద్దరు ఎమ్మెల్యేల జ్యుడిషియల్‌ రిమాండ్‌
-చెంచల్‌గూడ జైలుకు తరలింపు – బెయిల్‌పై విడుదలటెంటు కూలినా..
హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : బొల్లారం పిఎస్‌లో ఉద్రిక్తత నెలకొంది. మీడియా అక్కడి నుంచి వెళ్లిపోవాలని బుధవారం ఉదయం పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా విద్యుత్‌ సౌధ వద్ద నిరవధిక దీక్షకు యత్నించి అరెస్టయిన టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బొల్లారం పిఎస్‌లో మంగళవారం నుంచి తమ దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
అరెస్టుకు సిద్ధమే.. : హరీష్‌రావు
టెంటు కూలినా.. బలవంతంగా తరలించేందుకు యత్నించినా చూస్తూ ఊరుకోబోమని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నిన్న, ఈరోజు వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై కోర్టుకు వెడతామని, అసెంబ్లీలోను నిలదీస్తామని అన్నారు. మీడియాను ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఆదేశించడం సరైంది కాదన్నారు. సమస్యను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదన్నారు. ఏడు గంటల పాటు రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతుంటే.. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తమను సతాయించేందుకు పోలీసులను ఉసిగొల్పడం బాగోలేదన్నారు. ఏడు గంటల పాటు కరెంటు ఇవ్వండి.. దాంతో సమస్య పరిష్కారమవుతుంది. అంతేగాని శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తున్న తమపైకి పోలీసులను ఉసిగొల్పి ప్రభుత్వం తమాషా చూస్తోందన్నారు. విద్యుత్‌ కోతల వల్ల పరిశ్రమలు మూతపడే స్థితికి వచ్చాయి. పంటలు ఎండిపోతున్నాయి.. ఉద్యోగులు, రైతులు రోడ్లపై పడే పరిస్థితి వచ్చింది. విద్యుత్‌ కోతలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల చదువు సాగడం లేదు. పరిశ్రమల్లో మిషను చక్రం తిరగడం లేదని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతల వేళలు ఒకేలా ఉండాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ వేళల పాటు కరెంటు కోత విధిస్తున్నారన్నారు. ఈ వివక్షను తొలగించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్‌ జోక్యం చేసుకుని తెలంగాణ ప్రాంత రైతులకు ఏడుగంటల పాటు కరెంటు ఇస్తామని హామీ ఇస్తే తమ దీక్ష విరమించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోతామన్నారు. అప్పటివరకు దీక్షను కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని, మిగిలిన 12 మంది ఎమ్మెల్యేలం కూడా అరెస్టు అయ్యేందుకు సిద్ధమేనన్నారు.
టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు 14రోజులు రిమాండు
టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల విద్యుత్‌ సౌథ ముట్టడి సందర్భంగా మంగళవారంనాడు ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వినయ్‌భాస్కర్‌లను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఎమ్మెల్యేలకు 14 రోజుల పాటు రిమాండు విధించారు. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
గృహ నిర్బంధంలో నాయిని
టిఆర్‌ఎస్‌ విద్యుత్‌ సౌధా ముట్టడి కార్యక్రమాన్ని రెండో రోజైన బుధవారంనాడు కూడా చేపట్టనుండడంతో ముందస్తుగా పోలీసులు టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డిని, పద్మారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు.