విద్య వ్యాపారంగా మారింది

4

– ఇంజనీర్లు అటెండర్లయ్యారు

– స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో గవర్నర్‌ నరసింహన్‌

– తెలంగాణ జాగృతి సేవలు భేష్‌

– కేంద్రమంత్రి రాజీవ్‌ ప్రతాప్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి): మన విద్యావిధానంలో లోపం ఉందని గవర్నర్‌ నరసింహన్‌ ఆరోపించారు. విద్యా వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు.  నైపుణ్యం శిక్షణ విద్యలో భాగంగా ఉండాలని ఆయన సూచించారు. నైపుణ్యం లేకపోతే ఉద్యోగాలు రావని, సమాజంలో చైతన్యం రావాలని నరసింహన్‌ చెప్పారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసినవారు అటెండర్లుగా పనిచేస్తున్నారని, విద్యను వ్యాపారం చేశారని ఆయన విమర్శించారు. సరస్వతిదేవిని లక్ష్మీదేవిగా మార్చారని, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై మన వ్యవస్థ విఫలమైందని, గ్రావిూణప్రాంతాల్లోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎంపీలంతా విద్యావిధానంపై దృష్టిసారించాలని గవర్నర్‌ కోరారు.  దేశ విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భాగంగా ఉండాలని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లేకపోతే మేకిన్‌ ఇండియా తయారు కాదన్నారు. జాగృతి సంస్థ సమాజం మొత్తాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాగృతి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీ ఈ శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణలో తెలంగాణ జాగృతి దేశానికే ఆదర్శమని రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ కొనియాడారు. అశోక్‌నగర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ మాట్లాడుతూ.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కృషి ప్రశంసనీయమన్నారు. స్కిల్‌ ఇండియా మిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారని తెలిపారు. దేశంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రత్యేక శాఖను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మానవ వనరుల కోసం ప్రపంచం భారత్‌ వైపే చూస్తోందన అన్నారు. మోదీ స్కిల్‌ ఇండియా మిషన్‌ను ప్రారంభించారని, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం రాష్ట్రాలకు రూ.3వేల కోట్లు కేటాయించినట్లు ప్రతాప్‌రూడీ చెప్పారు. నైపుణ్యత లేక బీటెక్‌ విద్యార్థులకు రూ. 5 వేల వేతనం ఉన్న ఉద్యోగం కూడా రావడం లేదన్నారు. ఐటీఐ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యత బీటెక్‌ విద్యార్థుల్లో లేదన్నారు. సమాజంలో ఒక వెల్డర్‌ ఎన్నో రకాల పనులు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. కానీ వెల్డర్లలో ఉన్నతస్థాయి అధికారి కంటే ఎక్కువ సంపాదించే వారున్నారని చెప్పారు. వెల్డర్లకు సమున్నత గౌరవం దక్కట్లేదన్నారు. జాగృతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువతకు చక్కని నైపుణ్య శిక్షణ అందుతుందని తెలిపారు. యువతకు నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని రూడీ పేర్కొన్నారు. ప్రధాని కౌశల్‌ వికాస్‌ యోజన కింద రెండేళ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని.. వచ్చే రెండేళ్లలో మరో రూ.32వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 25వేల నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇండస్ట్రీకి  అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాలన్నారు. చైనా జపాన్‌ లాంటి దేశౠల్లో విద్యార్థులకు ఫ్యాక్టరీల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. నిష్ణాతులైన ఉద్యోగుల కోసం ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూస్తున్నాయన్నారు. తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ ఎంపీ కవితకు కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగుల శాతం ఎక్కువ అని వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 12 నైపుణ్య శిక్షణాకేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ సెంటర్లన్నింటీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని కవిత వెల్లడించారు. యూత్‌ ఎంపవర్‌మెంట్‌ లక్ష్యంగా దీనిని చేపట్టామని అన్నారు. మానవవనరుల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.   రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించింది. దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో జాగృతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం డిజైన్‌ చేసింది. ఈ క్రమంలో అశోక్‌నగర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్‌ రూడీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన జాగృతి ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి తిలకించారు. తదనంతరం ఏవీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రులు రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, బండారు దత్తాత్రేయ, ఎంపీలు జితేందర్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌తో పాటు జాగృతి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణ జాగృతి బ్రోచర్‌ను గవర్నర్‌ విడుదల చేశారు. బహిరంగ సభలో కవితపై గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర మంత్రులు రాజీవ్‌ ప్రతాప్‌రూడీ, బండారు దత్తాత్రేయతో పాటు ఎంపీలు ప్రశంసలు కురిపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కవిత కృషి అభినందనీయమన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చాలా అవసరం. నైపుణ్యం ఉన్నవాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ సాధనలో జాగృతి పాత్ర మరువలేనిదని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణలో భాగమైన జాగృతిని అభినందిస్తున్నాను. తెలంగాణ భవిష్యత్‌ యువత చేతిలో ఉంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయం. వేర్వేరు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఒకే గొడుకు కిందకు తేవడం మంచి ఆలోచన అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసినందుకు ఎంపీ కవితను అభినందిస్తున్నానని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.  నైపుణ్యం గల యువత దేశానికి ఎంతో అవసరం అన్నారు.  ఇంకా ఈ కార్యక్రమంలో  బిజెపి నేతలులక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.