వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం జరిగేనా..!

` ఆమె అప్పీల్‌పై నేడు తీర్పు వెలువరించునున్న ‘కాస్‌’
` వినేశ్‌ ఉదంతంతో బరువు కొలిచే నియమాల్లో మార్పులు!
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫైనల్‌కు చేరిన తర్వాత 100 గ్రాముల అదనపు బరువు ఉందని ఆమెపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.ఈ నిర్ణయాన్ని ఇతర దేశాల రెజ్లర్లు సైతం వ్యతిరేకించారు. 50 కేజీల విభాగంలో పోటీపడి 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురై వినేశ్‌ ఫొగాట్‌ న్యాయపోరాటం చేస్తోంది. అనర్హతను సవాలు చేస్తూ కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. ఆమె అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన కాస్‌ మంగళవారం సాయంత్రం ఆరు గంటల్లోగా తుది తీర్పును వెల్లడిరచనుంది.కాగా ప్రపంచ రెజ్లింగ్‌ గవర్నింగ్‌ బాడీ, యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రెజ్లర్ల బరువు కొలిచే నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ మార్పులు పూర్తిస్థాయిలో కాకుండా అథ్లెట్ల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని స్వల్ప మార్పులు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మార్పులను త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.