విమాన చార్జీలకు రెక్కలు!

యూఏఈ ప్రకటనతో టికెట్‌ ధరలను పెంచిన సంస్థలు
న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం(ఆగస్టు 5) నుంచి ప్రవాసులు యూఏఈకి రావొచ్చని అక్కడి యంత్రాంగం ప్రకటించింది. భారత్‌తో పాటు పాకిస్తాన్‌, శ్రీలంక, నేపాల్‌, నైజీరియా, ఉగాండా ప్రవాసులకు ట్రాన్సిట్‌ విమానాల ద్వారా యూఏఈ వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇక ఈ ప్రకటన రావడమే ఆలస్యం విమానయాన సంస్థలు టికెట్‌ ధరలను అమాంతం పెంచేశాయి. యూఏఈ వెళ్లేవారి నుంచి డిమాండ్‌ బాగా ఉండడంతో ప్రస్తుతం విమాన టికెట్‌ ధరలు సాధారణం కంటే 300 రేట్లు అధికంగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఢల్లీి-దుబాయ్‌ వన్‌వే టికెట్‌ ధర 750-900 దిర్హమ్స్‌(ఎకనామీ క్లాస్‌) ఉంటుంది. కానీ, ప్రస్తుతం 2వేల దిర్హమ్స్‌కు చేరుకుంది. ఇదే విధంగా మిగతా తరగతి టికెట్‌ ధరలు కూడా భారీగా పెరిగినట్లు ఢల్లీి, ముంబై, కోల్‌కతాలో ట్రావెల్‌ ఏజెన్సీలు కలిగి ఉన్న డీడీ పేర్కొన్నారు.