వెంకయ్యా క్షమాపణలు చెప్పు… విపక్షాల పట్టు

2

నేను అన్‌పార్లమెంటరీ వాడలేదు.. వెంకయ్య

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి):  కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది.  గురువారం ఉదయం  సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే విపక్ష సభ్యుల నిరసల మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు.అయితే వెంకయ్య క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేయటంతో సభలో గందరగోళం నెలకొంది. తమపై విమర్శలు చేసేముందు విపక్షాలు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రతిపక్షాలను అవమానపర్చడం మర్యాద కాదన్నారు. సభలను అడ్డుకోవటం తమ ఉద్దేశం కాదన్నారు. మరోవైపు వెంకయ్య నాయుడు తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తన వ్యాఖ్యలను విపక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నాయన్నారు. నిజాయితీగా మాట్లాడటమే తనకు తెలుసునని, ఎవరినీ ఉద్దేశించి తాను మాట్లాడలేదన్నారు. తానెప్పుడూ అన్‌ పార్లమెంటరీ పదాలు వాడలేదన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని వెంకయ్య కోరారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్‌ …సమావేశాలను 11.30గంటలకు వాయిదా వేశారు. తమపట్ల కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అనుచితంగా మాట్లాడారంటూ లోక్‌ సభ లో విపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్షాలను ఉద్దేశించి వెంకయ్య నిర్లక్ష్యంగా,చులకనగా మాట్లాడిన తీరు ఏ మాత్రం పద్దతిగా లేదని విపక్షాలు వ్యాఖ్యానించాయి. దీనిపై లోక్‌ సభలో సభ్యులు ఆందోళనకు దిగడంతో వెంకయ్య నాయుడు వివరణ ఇస్తూ,తాను ఎక్కడా అభ్యంతరకర పదాలు వాడలేదని, వాదనలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని అన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్దం చేసుకున్నారన్నారు.విమర్శలు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. దాని పై కాంగ్రెస్‌ నేత మల్లి ఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఆత్మగౌరవం ముఖ్యమని, అందువల్ల వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేయాలని ఆయన అన్నారు. దీనిపై స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ మాట్లాడుతూ వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చారు కనుక ఇంతటితో ముగించాలని అన్నారు. కాని విపక్ష సభ్యులు శాంతించలేదు. వెంకయ్య నాయుడు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్‌ లోక్‌ సభను పావుగంట సేపు వాయిదా వేశారు.