సీఎం కేసీఆర్‌కే సమాచారమిస్తా

3

– అపాయింట్‌మెంట్‌ కోరతా

– నయీంతో సంబంధాలు లేవు

– మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి): గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌కు ఏ డీజీపీ స్థాయి అధికారితోను సంబంధం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. సంచలనం కోసమే ఇలాంటి ప్రచారం జరిగిందని అన్నారు. ఇలా ప్రచారం చేసిన చానెల్‌ ఒకటి తరవాత క్షమాపణలు చెపపిందన్నారు. హైదరాబాద్‌లోని ఓ ¬టల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  నయీంను చంపడం మంచిదేనని, ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సలాం చేస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరానని, ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన కొంత సున్నితమైన సమాచారాన్ని ఆయనకు అందిస్తానని చెప్పారు. పోలీసు శాఖలో డీజీపీ అంటే అత్యున్నత స్థాయి అధికారి అని, ఇన్ఫార్మర్లను వాళ్లు డీల్‌ చేయరని చెప్పారు. మహా అయితే డీఐజీ స్థాయి అధికారి మాత్రమే ఇన్ఫార్మర్లను వాడుకుంటారన్నారు. సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లను ఇన్ఫార్మర్లుగా వాడుకుంటారని, అందులో తప్పులేదని తెలిపారు. కానీ దాన్ని సొంత లావాదేవీల కోసం, ఆస్తులు సంపాదించుకోడానికి దుర్వినియోగం చేయడం సరికాదని చెప్పారు. అలా ఎవరైనా చేసివుంటే వారిపైన విచారణ ఆధారంగా చర్య తీసుకోవాల్సిందేనని అన్నారు. నయీంను చంపడం మంచిదేనని, ఈ కేసులో ఉన్నవారందరినీ బయటకు తేవాలని దినేశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. డీజీపీ స్థాయి అధికారితో నయీంకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. నయీం కేసులో మాజీ డీజీపీలపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. తాను డీజీపీగా పనిచేసిన సమయంలో నయీంతో ఎలాంటి సంబంధాలు జరపలేదని.. మాజీ డీజీపీగా తన వంతు వివరణ ఇవ్వడానికే విూడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు. నయీంకు డీజీపీ స్థాయి అధికారితో సంబంధాలు ఉన్నాయంటూ ఓ వార్తా ఛానల్‌ నిరాధార ఆరోపణలు చేసిందని ఆక్షేపించారు. సమాజంలో ఫోర్త్‌ ఎస్టేట్‌కు గౌరవం ఉందని.. టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం అసత్య ప్రసారాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. నయీంతో సంబంధాలు ఉన్న డీజీపీ స్థాయి అధికారి ఎవరో చెప్పాలని ఛానల్‌పై పరువు నష్టం దావా వేయొచ్చని పేర్కొన్నారు. ఆ ఛానల్‌ తాను డీజీపీ కాకముందే అనేక ఆరోపణలు చేసిందని.. తర్వాత క్షమాపణలు కూడా చెప్పిందన్నారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌కు డీజీపీతో సంబంధాలు ఉండవని… ఇన్‌ఫార్మర్ల కోసం పోలీసు శాఖలో ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని దినేశ్‌రెడ్డి తెలిపారు. ఇన్‌ఫార్మర్ల గురించి డీజీ స్థాయి అధికారి వరకు మాత్రమే తెలుస్తుందని డీజీపీకి వారి గురించి తెలిసే ప్రసక్తే లేదన్నారు.  ఈ కేసులో సిట్‌ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని, ఆ విచారణను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇంకా ఎవరున్నా కూడా వారిని తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో, ఈ కేసుతో సంబంధం లేనివారిని ఇరికిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేఐసులో కలీముద్దీన్‌ అనే వ్యక్తి కోసం మాత్రం సీబీఐ వెతికినట్లు తనకు తెలుసని, అంతేతప్ప నయీముద్దీన్‌ కోసం ఎవరూ రాలేదని తెలిపారు. తాను బిజెపి పార్టీ ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. బిజెపి పాలనలో ఇలంటి గుండాలకు, గ్యాంగ్‌స్టర్లకు చోటు లేదన్నారు. గత రెండేళ్ల మోడీ పాలనలో ఇది అందరికి తెలుసన్నారు. సిట్‌ విచారణలో తేడా ఏమైనా వచ్చిందనుకుంటే అప్పుడు ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్‌ చేస్తామన్నారు. ఇలాంటి కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. తనపై ఇంతకుముందు కొంత దుష్పచ్రారం జరిగిందని ఆయన అన్నారు. గతంలో కూడా తాను డీజీపీ కాకముందు కేఎస్‌ వ్యాస్‌ పక్కన తాను ఉన్నానని, కాల్పులు జరిపానని ప్రచారం జరిగిందని, కానీ అసలు తాను ఆయన పక్కన లేనని చెప్పారు. వ్యాస్‌కు, తనకు మధ్య 400 గజాల దూరం ఉందని అన్నారు. అలాగే, తాను డీజీపీ కాకముందు శంషాబాద్‌ ప్రాంతంలో తనకు 1500 ఎకరాల భూములు ఉన్నట్లు నకిలీ పత్రాలతో ప్రచారం జరిగిందని గుర్తుచేశారు.  నయీం కేసును సిట్‌ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని.. నిజానిజాలు దర్యాప్తు తర్వాత వెలుగులోకి వస్తాయని దినేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏవైనా ఆధారాలు విూడియా వద్ద ఉంటే సిట్‌కు అందించాలని సూచించారు. నయీంకు సంబంధించి తనవద్ద ఉన్న సమాచారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సిట్‌ దర్యాప్తు పూర్తయ్యే వరకు విూడియా సంచలన కథనాలకు దూరంగా ఉంటే మంచిదని దినేశ్‌రెడ్డి సూచించారు. టిఆర్‌/-పి రేటింగ్‌ కోసం అసత్య కథనాలు సరికాదన్నారు. దీనివల్ల ప్రజలకే ఇబ్బందని అన్నారు. నయీంతో సంబంధాలు ఉన్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.