హైకోర్టును విభజిస్తేనే సంపూర్ణ తెలంగాణ
న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి): హైకోర్టు విభజన జప్యంపై కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గళం విప్పారు.
హైకోర్టును విభజిస్తేనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమౌతుందన్నారు. అలాగే రైతుల సమస్యపై కూడా ఆయన ప్రస్తావిస్తు గత పది సంవత్సరాల్లో రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. వ్యవసాయరంగంపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా 45 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గత పదేళ్లలో లక్షా యాబై వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదని, అందుకే వారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల విూద ఆధారపడి చితికిపోతున్నారని వినోద్ వివరించారు. తెలంగాణలో రైతులకు మేలు చేసేలా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంపీ వినోద్ తెలిపారు. దీని ద్వారా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేసేలా కనీస మద్దతు ధర, ఆర్ధిక సహాయం అందించాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.