భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

మాతృదేశ విముక్తి కోసం ఉరిని లెక్కచేయని సాహసి

హబీబా బేగం

పుట్టిన గడ్డ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాబిమానులైన బిడ్డలు ఎంతట త్యాగాలకైన సిద్దపడతారన్న విషయం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర నిరూపిస్తుంది. అటువంటి నిరూపణలకు దృష్టాంతరంగా నిలుస్తారు శ్రీమతి హబీబా బేగం.

హబీబా బేగం 1833లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్‌లో జన్మించారు. చిన్నతనం నుండే బానిస భావాలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రనారంబించిన హబీబా మనస్సును బ్రిటిషర్ల బానిసత్వంలో మగ్గుతున్న మాతృభూమి దయనీయ స్థితి కలచివేసింది. ఆ వ్యధ నుండి వలస పాలకుల మీద ఆగ్రహం ప్రజ్వరిల్లింది. తెల్లపాలకులను శత్రువులుగా పరిగణించి, మాతృభూమిని బ్రిటిషర్ల నుండి విముక్తం చేసుకునేందుకు సరైన ఆదనుకోసం ఎదురు చూడసాగారు.

1857లో ఆమెకు ఆ అవకాశం లభించింది. భారతావనిలోని పలు ప్రాంతాలలో హబీబా బేగం వీర నారీమణలు, వీర పుత్రలు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల, అధికారుల మీద కత్తులు దూశారు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న హబీబా తిరుగుబాటు యోధులతో కలసి రణరంగ ప్రవేశం చేశారు. సోదర తిరుగుబాటు వీరులతో కలసి బ్రిటిష్‌ సైనికపటాలాల మీద తిరగబడ్డారు. ఆ నేరానికి ఆమెను ఆరెస్టు చేశారు.

నాటి దేశభక్తులకు ప్రాణాలు లెక్కలోనివి కావు. మాతృభూమి ప్రాణత్యాగానికి సిద్దమయ్యారు. పరాయి ప్రభుత్వంపై తిరగబడిన నేరానికి 1857లో బ్రిటిషు సైనిక న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది. ప్రధమ స్వాతంత్య్రసంగ్రామ యోధురాలు హబీబా సంతోషంగా ఉరిని స్వీకరించారు.

గెరిల్లా దాడులతో బ్రిటిష్‌ సైనిక దళాలను హడలెత్తించిన

”ఆకుపచ్చ దుస్తుల” యోధురాలు

భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం మహత్తర ఘట్టం. ఈ పోరాటంలో అసమాన్యులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఆయుధాలు చేపట్టి మాతృభూమి రక్షణకు శత్రువుతో పోరాటం చేశారు. ప్రాణాలను అర్పించారు. ఈ అర్పణకు వయస్సుతో నిమిత్తం లేకుండా పోయింది.. అందరి లక్ష్యం ఒక్కటే! పరాయి పాలకుల పెత్తనం నుండి మాతృభూమి విముక్తి కలిగించటం. అందుకోసం ప్రతిఒక్కరూ కొదమసింగాలై పోరాడారు, సివంగులై  గర్జించారు. ఈ మేరకు శత్రువును గడగడలాడిస్తూ పోరాట పథంలో అమరత్వం పొందిన అజ్ఞాత మహిళలు పలువురున్నారు. ఆ కోవకు చెందిన ఆకుపచ్చ దుస్తులీ మహిళ గా ఖ్యాతి చెందిన ఓ మహిళ చరిత్రపుటలలో అస్పష్టంగా దర్శనమిస్తారు.

చరిత్రలో ఆమె పేరు ప్రస్తావన లేదు. ఆమె ఆకుపచ్చ దుస్తుల మహిళగా మిత్రలు-శత్రువులచే గుర్తించబడ్డారు. ఆమె ఎల్లప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటంతో ప్రజలతోపాటుగా శత్రువు కూడా ఆ పేరుతో ఆమెను పిలుచుకున్నారు. ఆమె మగదుస్తులతో కన్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడమని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె పిలుపుతో ఉన్న ఆకర్షణ ఫలితంగా ప్రజలు అసంఖ్యాకంగా ఆమెను అనుసరించారు. ఆ విధంగా ఆమె వెంట నడిచిన దేశభక్తి ప్రపూరితులైన ప్రజలతో ఆంగ్లేయ సైనికుల శిబిరాల మీద దాడులు నిర్వహించారు. ప్రజలలో మాతృదేశ భక్తి భావనలను రెచ్చగొట్టే శత్రువుకు వ్యతిరేకంగా ప్రేరేపించి, ప్రజలను తన వెంట తీసుకుని, ప్రళయ భీకరంగా గర్జిస్తూ బ్రిటిష్‌ సైనికుల మీద విరుచుకుపడ్డారు. స్వంత దళాలతో ఆకస్మికంగా దర్శనమిచ్చి, అద్భుత కౌశల్యంతో కత్తి తిప్పుతూ, గురితప్పకుండా తుపాకి పేల్చుతూ శత్రుమూకలను చీల్చి చెండాడిన ఈమె పలుసార్లు శత్రుస్థావరాల మీద విజయవంతంగా దాడులు నిర్వహించారు. అనుచరులు యుద్ధరంగం వదిలి వెళ్ళినా ఆమె మాత్రం చెక్కుచెదరని ధైర్యసాహసాలతో శత్రువును ఎదుర్కొని, శత్రువు కంట పడకుండా చాకచక్యంగా గెరిల్లా పోరు జరిపి తప్పించుకున్న ఘట్టాలున్నాయి. ఆ విధంగా తప్పించుకున్న ఆమె ఎక్కడకు వెడుతుందో, మళ్ళీ ఆమో ఎక్కడ నుండి వస్తుందో ఎలా వస్తుందో, ఏం చేస్తుందో ఏలా మాయమవుతుందో శత్రుగూఢచారులకు అంతుబట్టలేదు.

ఈ మేరకు బ్రిటిష్‌ సైనికుల మీద, సైనిక స్థావరాల మీద ఆమె చేసిన దాడులు, ఆ దాడుల తీరుతెన్నులను9 దర్శించిన అదృష్టవంతులు వివరించిన కథనాలు, బ్రిటిష్‌ అధికారులు రాసుకున్న అదికార, అనదికార లేఖలు, ప్రభుత్వ రికార్డులు ఆమె సాహస కృత్యాలను వెల్లడిస్తున్నాయి. ఈ పచ్చదుస్తుల మహిళ సాహసాన్ని ప్రస్తావిస్తూ ‘బేగమత్‌ కి అంశూ’ అను గ్రంథంలో రచయిత పేర్కొనట్లు ‘భారత్‌కే స్వాతంత్య్ర సంగ్రామం మే ముస్లి మహిళా వోంకా యోగదాన్‌’ అను పుస్తకంలో రచయిత్రి అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ ఆచార్చులు డాక్టర్‌ అబిదా సమీయుద్ధీన్‌ ఈ విధంగా ఊటంకించారు.

‘..ఆ మహిళ అద్వితీయ ధైర్యశాలి. ఆమెకు మృత్యుభయం ఏ మాత్రం లేదు. ఫిరంగులు గర్జిస్తున్నా, తుపాకులు గుండ్లను వర్షిస్తున్నా అత్యంత ధైర్యశాలి అయిన సైనికుడి మల్లే ఆమె తుపాకి గుండ్ల వర్షంలో నింపాదిగా నడిచి వెళ్ళేది. ఆమెను కొన్ని సార్లు నడిచి వస్తుంటే చూశాం. మరికోన్నిసార్లు గుర్రం మీద స్వారి చేస్తూ చూశాం. ఖడ్గవిన్యాసంలో, గురి తప్పకుండా తుపాకి పేల్చడంలో ఆమె మంచి నేర్పరి. ఆమె ధైర్య సహసాలనుచూసి ప్రజలలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యేది..’ ఈ వర్ణన ద్వారా ఆమె గెరిల్లా పోరు సాగించేదని మనం అర్ధం చేసుకోవచ్చు ఆమె ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో శత్రువుకు తెలియకుండా దాడులు జరిపిన తీరు ఆమె గెరిల్లా రణతంత్రాన్ని స్ఫురణకు తెస్తుంది.

బ్రిటిష్‌ స్థావరం మీద దాడి చేసి శత్రుసైనికులతో పోరాడుతూ ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయం కారణంగా ఆమె గుర్రం మీద నుండి కింద పడిపోయారు. అసమయాన్ని అదునుగా ఉపయోగించుకుని శుత్రువు ఆమెను చుట్టుముట్టి బంధించారు. అక్కడి నుండి ఆమెకు సైనిక స్థావరానికి తరలించారు. ఆమెను బ్రటిషు అధికారి లెప్టినెంట్‌ హడ్సన్‌ కట్టుదిట్టమైన బందోబస్తుతో అంబాలాలలోని బ్రిటిషు సైనిక  స్థావరానికి పంపాడు. ఆ సమయంలో అంబాలలోని ఆంగ్లేయ సైనికాధికారులకు ఆమె గురించి, ఆమె నిర్వహించిన దాడుల గురించి, ఆమె తిరుగుబాటు కార్యకలాపాల వివరాలను, ఆమె ధైర్యసాహసాలను వివరంగా ఎకరువు పెడుతూ, జాగ్రత్తలు చెబుతూ అంబాలా సైనిక స్థావరం డిప్యూటీ కమిషనర్‌కు 1857 జూలై 29న లేఖ రాశాడు.

ఆ లేఖలో, నేను మ వద్దకు ఒక ముస్లిం ముదుసలిని పంపుతున్నాను. ఆమె విచిత్రమైన మహిళ, ఆమె ఆకుపచ్చ దుస్తులు ధరిస్తుంది. కంపెనీ మీద తిరుగుబాటు చేయమని ప్రజలను రెచ్చగొట్టడం ఆమె పని.  స్వయంగా ఆయుధాలు చేపట్టి తిరుగుబాటు దారులను నాయకత్వం వహించి మన స్థావరాల మీద దాడులు చేస్తుంది. పలుమార్లు మన స్థావరాలపై ధైర్యసాహసాలతో విరుచుకుపడింది. ఆమె బారిన పడిన మన పిసాయిలు, అధికారుల చెబుతున్నారు. ఆమె పట్టుబడిన రోజున, శిక్షణ పొందిన సైనికాధికారిలా నగరంలోని తిరుగుబాటుదారులను కూడేసుకుని, మన స్థావరాల మీద దాడి చేసి పోరాడుతూ పట్టబడింది. ఆమె కడు ప్రమాదకారి.. జాగ్రత్త సుమా, అని పేర్కొన్నాడు.

ఈ లేఖను ఖుర్షీద్‌ ముస్తఫా రజ్వీ రాసిన జంగ్‌ యే ఆజాది 1857 అను ఉర్దూ గ్రంధంలో ప్రచురించారని, భారత్‌ కే స్వాతంత్య్ర సంగ్రామం మే ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌ గ్రంధ రచయిత డాక్టర్‌ అబిదా సమియుద్దీన్‌ తన గ్రంధంలో వివరంగా ఉటంకించారు. ఈ లేఖతో పాటుగా అంబాలలోని ఇతర ఆంగ్లేయాధికారులకు పలు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ఆకుపచ్చఅయ  దుస్తుల మహిళను అంబాలలోని బ్రిటిషు సైనిక స్థావరానికి పటిష్టమైన బందోబస్తుతో తరలించారు.

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అత్యంత క్రూరిడిగానూ, ఇచ్చిన మాట తప్పటంలో ప్రప్రధమునిగా అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆంగ్లేయాధికారి లెప్టినెంట్‌ హడ్సన్‌ లాంటి బ్రిటిష్‌ సైనికాధికారి ఆమె ధైర్యసాహసాలను స్వయంగా ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన సహచర అదికారులకు లేఖల ద్వారా తెలియజేశారు. మాతృభూమి పట్ల ఆయెకున్న గౌరవం అతడిని అమితంగా ఆకట్టుకుంది. ఆ ప్రభావంతో ‘జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌’ తో ఆమెను పోల్చుతూ కీర్తించాడు.

ఆ ఆంగ్లేయాధికారి రాసిన లేఖలలోనే హెచ్చరికలను, ఆమె చర్యలను అధికారిక లేఖలలో ఆమె కార్యకలాపాలను వివరించిన తీరు, ఆ సందర్భంగా లేఖలో వాడిన భాష తీవ్రతను బట్టి ఆకుపచచ దుస్తుల మహిళ గా ఖ్యాతిగాంచిన ఆయోధురాలు బ్రిటిష్‌ సైనికాధికారుల గుండెల్లో గుబులు పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మేరకు అంబాలా సైనిక స్థావరానికి పంపబడిన ఆమె ఆ తరువాత ఏమైందో తెలియరాలేదు. శత్రుదళాలలో అంతటి భయోత్పాతం సృష్టించి ఆంగ్లేయ అదికారును హడలగొట్టడం కాకుండా కడు జాగ్రత్త సుమా అంటూ పరస్పరం ముందస్తు జాగ్రత్తలు తెలుపుకోవాల్సినంత భయానక పరిస్థితులను బ్రిటిషు సైనిక స్ధావరాలలో కల్పించిన ఆ యోధురాలిని శత్రువు ఏం చేసి ఉంటారన్న విషయం మనం ఊహించలేనిది ఏ మాత్రం కాదు.