చరిత్ర, నిశ్శబ్దాలు

తెలంగాణ దురాక్రమణ దినం సందర్భంగా

2001 సెప్టెంబరు 11న అమెరికన్లను నిర్ఘాంతపరిచింది – మరణాలు, వినాశనం మాత్రమే కాదు, తమ పట్ల ప్రపంచానికి ద్వేషం వుందనే గ్రహించవు. అయితే ఆ ద్వేషానికి కారణం వారికి అంతుపట్టలేదు. దేవుడంటే భక్తి, స్వేచ్ఛ, ప్రగతి అంటే నమ్మకం, విజ్ఞానశాస్త్ర, సాంకేతికరంగ, వ్యాపార పురోగతి ఫలాన్ని ఇతరులకి పంచే గుణం, మూడో ప్రపంచ దేశాలకి అందించే ఆర్థిక సహాయం – ఇలా అనేక రకాలుగా మానవాళికి ఉపయోగపడే తమ పట్ల ఎందుకంత ద్వేషం ఉన్నదో అమెరికన్లకి అర్థం కాలేదు. 60 ఏళ్ల క్రితం 1948లో హైదరాబాద్‌ రాజ్యంలో ముస్లింలు కూత తమపై జరిగిన దాడిని చూసి ఈ విధంగానే నిర్ఘాంతపోయారు. ఆస్తి, ప్రాణ నష్టాలతో పాటు, తమ పట్ల తీవ్రమైన ద్వేషముందనే గ్రహింపు వారికి షాక్‌కి గురిచేసింది. అమెరికన్లు కోపోద్రేకంతో రెండు దేశాలపై దాడి చేసి వాటిని సర్వనాశనం చేస్తే హైదరాబాదు ముస్లిం లు మూగబోయి తమలో తామే కుమిలి పోయారు. ఆత్మన్యూతనా భావానికి లోనయ్యి, తమపట్ల తామే అనుమానం పెంచుకొని జరిగిన ఉపద్రవానికి తామే కారణమని భావించసాగారు.

ఇది జరిగిన తరువాత ముస్లింలు కొంతకాలం పాటు, పోలీసు చర్య సమయంలో వ్యక్తమయిన ద్వేషం, అంతకు సంవత్సరం క్రితం దేశ విభజన సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన ఉన్మాదం, కోపం వంటిదని అనుకున్నారు. కానీ క్రమేణా, తమపై జరిగిన దాడులన్నీ పథకం ప్రకారం జరిగాయని వారికర్థమయిన పుడు ముస్లింలకు రెండో షాక్‌ తగిలింది. ఇది జరిగిన చాలా కాలానికి, 1948 దాటి మూడు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా తమపై కోపం, ద్వేషం అలాగే మిగిలిపోయాయని అర్థమయినపుడు వారికి మూడో షాక్‌ తగిలింది. అవి మతకల్లోలాల పేరుతో జరిగిన దాడులు, బ్యాంకు రుణాల తిరస్కరణ, అనేక రకాల వివక్షతల రూపంలో ముస్లింలకు అనుభవంలోకి వచ్చాయి. సమాన పౌరుల వుదామని ఆశపడ్డారు గానీ, అందుక్కావల్సిన వనరులు, అవకాశాలు తమకి లభించట్లేదని వారికి అర్థయింది.

ఒకదాని తరువాత ఒకటిగా తగిలిన ఈ షాక్‌లు ముస్లింల క్షోభని తీవ్రతరం చేశాయి. ఇతర రకాల నిశ్శబ్దాలు కూడా వారి దృష్టిలోరి రాసాగాయి. నిజాం పాలనలో అందరికన్నా ఎక్కువ గా లాభపడిన హిందువులు, అప్పటి వరకూ ముస్లింలకు అన్ని విధాలుగా సన్నిహితంగా ఉండిపోయారు. పోలీసు చర్యకు ముందు హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉంటే తామే ముస్లింలకన్నా లభపడటానికి అవకాశం ఉందని గ్రహించి ‘స్వతంత్ర హైదరాబాద్‌’ ను కోరుకున్నది ఈ హిందువులే. అతికొద్ది మందిని మినహాయిస్తే ఈ హిందువులు ముస్లింలను సమర్థించడం కానీ, వారికి పరిస్థితిని వివరించడం కానీ చేయలేదు. ఇటువలంటి హిందువుల మోసపూ రిత మౌనం, సంచుచితత్వం ముస్లింలకు షాక్‌కు గురిచేసింది. ఈ పరిస్థితిలో వారిని రోజువారి జీవితంలో దళితులు దగ్గరికి తీసుకుని ఓదార్చారు. అప్పటి హైదరాబాద్‌ సంస్థానంలోని ముస్లింలకు తమ హిందూ స్నేహితుల్లో చాలా మంది ఆర్యసమాజ్‌, జనసంఘ్‌, కాంగ్రె స్‌, కమ్యూనిస్టు సంస్థలకు రహస్య సమర్థకులని తెలిసింది. ముస్లిం లను ఈ షాక్‌ సమూలంగా కుదిపేసింది. హిందూ-ముస్లింల మధ్య సామాజిక సంబంధాలు తెగిపోయి, ముస్లింలు తమదైన ప్రపంచం లోనికి కుంచించుకుపోయారు.

పోలీసు చర్య గురించి నిజం తెలిసిన కొంత మంది హిందువులు అల్ప సంఖ్యాకులుగా మిగిలిపో యారు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒక పక్కకు నెట్టబడి, ఆపదలో ఉన్న దగ్గరి ముస్లిం స్నేహితులకు ఏమీ చేయ లేక పోయినందుకు తమని తాము నిందించుకున్నారు. ఈ హిందూ, దళిత స్నేహితులే తరువాతి కాలంలో ముస్లింల దు:ఖాన్ని పంచుకోవ డానికి ముందుకొచ్చారు.

విలీన సమయం తరువాత హైదరాబాదు ముస్లింల నిశ్శ బ్దాన్ని పరిశీలించినపుడు, ఒక రకంగా తమ కోపాన్ని భయాన్ని దాచుకోవడానికి మౌనం వహించారేమో అన్పిస్తుంది. ఇంకో కోణం నుంచి చూస్తే అప్పుడున్న రాజకీయ అభిప్రాయాలతో తమకున్న అంగీకారం లేదా అనంగీకారాల గురించి సిగ్గుపడి మౌనం వహిం చారనిపిస్తుంది. పలు కారణాలతో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, మజ్లిస్‌ పార్టీలతో దూరంగా వున్నందుకో, వారిని ప్రశ్నించకుండా ఉన్నం దు కో, ఇంకా చెప్పాలంటే ఆ పార్టీలతో కలిసి పనిచేసినందుకు కూడా అవమానిపడినట్లు కన్పిస్తుంది. తమ పాత రాజకీయ సంబం ధాలు, వ్యక్తం చేసిన రాజకీయ అభిప్రాయాలు అన్నీ ముస్లింల కు తప్పుగా అన్పించసాగాయి. తరువాత ఆ సంబంధాలను, అభిప్రాయా లను సమర్థించుకోవటానికి అబద్ధాలు, అతిశయోక్తులూ వారికి అవసరమ య్యాయి. రాజకీయ, ఆర్థిక, నైతిక వనరుల భరోసా కోల్పోవ టంతో ఆవరించిన రాజకీయ నిర్వీర్యత వల్ల కలిగిన నిశ్శబ్దం ఆవరించింది. బాధల్లో వున్న తమతోటి ముస్లింలకు ఏమీ చేయలేకపోయామే అన్న నైతిక వేదన అపరిమిత విచారం మిగిల్చింది.

అందరికన్నా ఎక్కువగా బాధలుపడిన సాధారణ ముస్లిం ప్రజలు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. తమ దు:ఖాన్ని బాధలను ఎవరితోనూ పంచుకోవాలని వారికి అనిపించలేదు. పోలీసు చర్య సందర్భంగా జరిగిన బీభత్సాన్ని గుర్తు తెచ్చుకోవటం వారికి అసాధ్య మన్పించింది. తమలాగే బాధపడుతున్న కుటుంబ సభ్యులతో, ఇరు గుపొరుగువారితో పంచుకుంటే వారిని మరింత బాధపెట్టిన వాళ్ల మవుతామని అనుకున్నారు. లోపల్లోపల అందరూ బాధపడుతు న్న ప్పటికీ, పైకి అంతా మామూలుగానే వున్నట్లు నటించడంతో అంత టా నిశ్శబ్దం ఆవరించింది. సమస్యలన్నిటికీ మీరే కారణమని హిందు వులు తిడతారనే భయం వల్ల ముస్లింలకు హిందువులతో తమ బాధ లను  పంచుకోవాలని అనిపించలేదు. వెంటాడుతున్న జ్ఞాపకాల నుం చి తప్పించుకోటమే అత్యవసరం అనిపించి, రోజువారీ తిండితి ప్పల పైన దృష్టి సారించారు. ఆ నిశ్శబ్దంలోనే ఒకర్నొకరు ప్రోత్సహించు కొని తమ దిగ్భ్రాంతి, వేదనల నుంచి నిశ్శబ్దమే సహజంగా, జరిగి పోయిన దానిగురించి మాట్లాడటం అర్థరహితం అనిపించ సాగింది.

కొత్త అధికార యంత్రాంగంలో స్థానం కాపాడుకున్న ముస్లికులీన వర్గ నాయకులు కూడా నోరెత్తలేకపోయారు. అభాగ్యు లైన ముస్లిం సోదరుల గురించి మాట్లాడి తమ అస్థిర స్థానాన్ని దెబ్బతీసుకోవడం వారికి అసాధ్యంగా పరిణమించింది. తమ హిం దూ సహుద్యోగుల చేతలని ముస్లిం వ్యతిరేక నిర్ణయాలని వారు స్వయాన చూశారు. అయితే లోలోపల జరిగిన ఉపద్రవానికి సాధారణ ముస్లిం సమూహాన్నే తప్పుపట్టారు. ఏమని? ‘ఏ షరతులు లేకుండా చెప్పాం. వారు మా మాట వినలేదు. ఇప్పుడు వారు పదే పదే బాధలు చూస్తుంటే మేం చేసింది సరైనది, వారు చేసింది తప్పని తెలుస్తోంది. వారి బాధలు వారే పడాలి’ అని. పై కారణాల వల్ల మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యం కల్గించింది. అనేక సందేహాలు కలిగాయి. ‘మేమంత చెడ్డవారిమా? మమ్మల్ని ఎవ్వరూ ఎందుకు పట్టించుకోవట్లేదు? నిజాం, మజ్లిస్‌, రజాకార్లు అందరూ అంత పాపిష్టి వాళ్లా? వారి పేరుతో ముస్లిం  ప్రజలందరికీ ఇంత పెద్ద శిక్ష ఎందుకు విధించారు?’ ఇది జరిగిన యాభై ఏళ్లకి వారికి వేరే సందేహాలు కలుగుతున్నాయి.

‘హిందువులెందుకు ఆ కాల జ్ఞాపకాల నుంచి బయట పడలేకపోతున్నారు? ఓ రెండు సంవత్సరాల ‘రజాకార్ల’ జ్ఞాపకాల గురించి పదే పదే ఎందుకు మాట్లాడతారు? పోలీసు చర్యలో అంతకు వందరెట్లు ప్రాణాలు, ఆస్తులు, ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడిన ముస్లింలు దాన్నే మర్చిపోయి బతుకుతుంటే, హిందువులు రజాకార్లనెందుకు మరిచిపోలేకపోతున్నారు? దాన్ని వారు నిరవధిక విజయోత్సాహ నినాదంగా ఎందుకు మారుస్తున్నారు? ఇది రజాకార్ల పేరుతో ముస్లింలను అవమాన పరచడానికి కావాలని చేస్తున్న ప్రయత్నమా? రజాకార్లను తమ నినాదాలలో ఇంకో యాభై ఏళ్లు బతికించి, ముస్లింలను ఆ జ్ఞాపకాలకు బలి చేస్తారా?

1943 తర్వాత హైదరాబాద్‌ చరిత్ర నిండా ఈ నిశ్శబ్దాల, జ్ఞాపకాల రాజకీయాలే. ఈ నిశ్శబ్దాలు ముస్లింలకు కొంత మేలు, కొంత హాని చేశాయి. స్వాతంత్య్రానంతరం దేశంలోని ముస్లింలు మళ్లీ నిలదొక్కుకుని, నిలబడింది హైదరాబాదులో మాత్రమేనని కూడా చాలా బలంగా అభిప్రాయపడతారు. ఇలాంటి కఠోర నిశ్శబ్దం నుంచి ఈ మధ్య గొంతు విప్పే వరకుచేసిన ప్రయాణమే గత యాభై ఏళ్ల హైదరాబాద్‌ ముస్లిం చరిత్ర. ఇటువంటి పరిస్థితుల్లో ముస్లింలు ఉర్దూలో రాసిన చరిత్రను గమనిస్తే ఆ చారిత్రక రచనలు మూడు రకాలుగా కన్పిస్తాయి.

1) నిజాం సమర్థకులు : వీరు నిజాంను అందరికన్నా గొప్ప పాలకుడని సమర్థిస్తూ, చారిత్రక పత్రాలనుపయోగించి ఆయన ఆధునికీకరణకు శ్రీకారం చుట్టి ఎన్నో ప్రజెపయోగ విధానాలను ప్రవేశపెట్టిన వానిగా, సంస్కరణవాదిగా నిరూపించే ప్రయత్నం చేశారు.

2) పాత జ్ఞాపకాల్లో కొట్టుకుపోయే వారు (నొస్టాజియా) : వీరు జరిగిపోయిన కాలమే ప్రస్తుత కాలం కన్నా బాగుండేదని, ఆ కాలాన్ని పోగొట్టుకున్నందుకు తాము పడేబాధను తమ రచనల్లో వ్యక్తం చేశారు.

3) వ్యక్తిగత రచనలు : ఇవన్నీ స్వీయ చరిత్ర పద్ధతిలో రాసుకున్న జ్ఞాపకాలు. అనుభవాలు, గమనించిన విషయాలు. చాలా వరకు ఇవి సంతోషకర జ్ఞాపకాలు. వ్యథాపూరితమైన చారిత్రక అంశాల గురించి ఇవి మాట్లాడవు.

మనకు 40వ దశకంలో రాజకీయాలపై ముస్లింల దృక్పథాలు, స్థానిక చరిత్రలు, ప్రజల జీవితాలపై పోలీసు చర్య ప్రభావం, ముస్లింలు సర్దుబాటు చేసుకున్న విధానం , ఆర్థిక సామాజిక సమస్యలు, మొదలైన వాటి గురించి మనకు చాలా మంది ముస్లిం చరిత్రకారులు ఈ విషయాలపై పరిశోధన చెయ్యటం తప్పనీ లేదా తమకు సాధ్యపడదనీ అనుకున్నారు.

ఇప్పుడున్న హైదరాబాద్‌ చరిత్రను చాలా వరకు కాంగ్రె స్‌, కమ్యూనిస్టు, హిందుత్వవాదులు మాత్రమే రాశారు. తెలుగు, ఇం గ్లిష్‌ల్లో వచ్చిన రచనలు అసంపూర్తిగా, ఏకపక్షంగా ముస్లిం దృ క్ప థాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా, ఒక్కోసారి ‘విద్వే ష పూరిత వ్యాఖ్యానం’లానూ(హేట్‌స్పీచ్‌), ప్రచారంగానూ అనిపిస్తాయి.

ఈ రచనల్లో చివరి నిజాం పరిపాలనా కాలాన్ని ‘మంచి -చెడూ’ అనే అతి సాధారణ స్థాయిలో చూసే ధోరణి కనిపిస్తుంది. వీటిలో ముస్లింలందరూ హింసాపరులు, తెలివి తక్కువ వారు, నవాబీ జీవితాన్ని కోరుకునేవారు, ప్రతి నాయకులుగానూ కన్పిస్తారు. ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తున్న హైదరాబాద్‌ ముస్లిం అస్థిత్వ స్వరం ఇటువంటి పాక్షిక చరిత్ర రచనలను ప్రశ్నించి, ముస్లింల అనుభ వాన్ని జోడించిన కొత్త దృక్పథాలతో ఈ చరిత్ర కాలాన్ని పున: పరిశీలించాలని నొక్కి చెప్తోంది.

– ఎంఏ మోయిద్‌

తెలుగు అనువాదం : ఎ. సునీత