పెద్ద ధన్వాడలో రణరంగం
రాజోలి, జూన్ 04 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న 14 గ్రామాల ప్రజలు బుధవారం ఆకస్మికంగా పరిశ్రమ నిర్మాణ ప్రదేశాన్ని ముట్టడించారు. కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు, సామాగ్రిని నిప్పు పెట్టారు. జేసీబీలను అడ్డుకున్నారు. కంపెనీలో పని చేయడానికి వచ్చిన కూలీలను తరిమికొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలంలో పోలీసులను భారీగా మొహరించారు. నిరసనలకు దిగిన రైతులను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగతనంగా కంటైనర్లు, టిప్పర్లు, జేసీబీలను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులకు, గ్రామస్థులకు మధ్య జరిగిన ఘర్షణలో పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మరియమ్మపై పోలీసులు లాఠి చార్జి చేయగా తలకు తీవ్రగాయం కావడంతో బాధితురాలు అయిజ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరో ఇద్దరి మహిళలకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.