ప్రజాగ్రహంలో ఘటనలో జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసు

పెద్దధన్వాడ ఘటనా స్థలిలో లేకపోయినా అక్కసుతో యాజమాన్యం ఫిర్యాదు
ఖండిరచిన జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు
హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి): పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజాగ్రహం కేసులో జనంసాక్షి పత్రికా సంపాదకులు ఎంఎం రహమాన్‌పై అక్రమ కేసు పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత పదినెలలుగా గ్రామస్తుల ఆందోళనలు, వారికి సంఫీుభావంగా అనేక కథనాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ‘జనంసాక్షి’ మద్దతు తెలిపింది. అయితే బుధవారం రోజున పనులు చేపడుతున్నారనే సమాచారంతో నిరసన తెలిపేందుకు వచ్చిన గ్రామస్తులపై ఫ్యాక్టరీ ప్రైవేటు సైన్యం (బౌన్సర్లు) దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అక్కడి సామాగ్రి ధ్వంసం చేయడంతో పాటు కంటైనర్‌కు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో 40 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 12 మందిని రిమాండ్‌కు తరలించారు. అయితే బుధవారం రోజున జనంసాక్షి ఎడిటర్‌ ఘటనా స్థలంలో లేరు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. అయినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం అక్కసుతో పెట్టిన తప్పుడు ఫిర్యాదు మేరకు రాజోలి పోలీసులు కేసు నమోదు చేశారు. పత్రికా సంపాదకుడిపై ఈ కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండిరచారు.

అక్రమ కేసులు సహించేది లేదు
` విరహత్‌ అలీ, టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు
పత్రిక ఎడిటర్‌పై వార్తా కథనాలు ప్రచురించినందుకు అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదు. ఎలాంటి పోరాటానికైనా టీయూడబ్ల్యూజే సిద్ధంగా ఉంటుంది.

రహమాన్‌పై కేసు సమంజసం కాదు
` అల్లం నారాయణ, ఆస్కాని మారుతి సాగర్‌, టీయూడబ్ల్యూజే
జనంసాక్షి ఎడిటర్‌ రెహమాన్‌పై రాజోలి పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. రెహమాన్‌ అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ అతన్ని ప్రధాన నిందితుడిగా నమోదు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. వెంటనే ఈ కేసును ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే గద్వాల ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడాం. కేసును ఎత్తేసే విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి.

రెహమాన్‌ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
` చిన్న మధ్యతరహా పత్రికల సంఘం డిమాండ్‌
కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చెలరేగిన హింసకు బాధ్యుడిగా జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్‌ పై కేసు పెట్టడాన్ని చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం తీవ్రంగా ఖండిరచింది. ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బిజిగిరి శ్రీనివాస్‌, సిరికొండ అగస్టీన్‌ లు ఒక ప్రకటనలో ఖండిరచారు. బాధ్యతాయుతమైన పత్రిక ఎడిటర్‌ పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని పర్యావరణానికి, జల కాలుష్యానికి కారణమవుతున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, యాజమాన్యం ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు పై సమగ్ర విచారణ జరిపించి సంపాదకుడు పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు

 

పెద్దధన్వాడ కేసులో 41 మంది రైతులపై కేసు

` కంపెనీ అనుమతులు రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి
` అప్పటివరకు పోరాటం ఆగని గ్రామస్తుల స్పష్టం
రాజోలి, జూన్‌ 05 (జనంసాక్షి) : ఇథనాల్‌ కంపెనీ రద్దు కోసం పోరాటం చేస్తున్న రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని గ్రామస్తులు ఆరోపించారు. ఇథనాల్‌ కంపెనీ రద్దుకోసం జరిగిన నిరసన పోరాటంలో నిరసన కారుల పోరాట పటిమ, అంకితభావాలను సహించలేని కంపెనీ యజమాన్యం కుట్రపూరితంగా తమ అనుచరులు, మహిళలపై, పేద ప్రజలపై దాడి చేశారన్నారు. అక్రమ కేసులు పెట్టి సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టడం చాలా దారుణమన్నారు. కంపెనీ రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని పిలుపునిచ్చారు. కానీ చేయని నేరానికి రైతుల మీద, ఉద్యమకారుల మీద తీవ్రమైన సెక్షన్లతో అక్రమ కేసులు బనాయించారు. మేం ప్రభుత్వానికి, పోలీసులకు ఒక విషయం స్పష్టం చేయలదలుచుకున్నాం. మేం కంపెనీ హింసను, అక్రమాలను, దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతే తప్ప మేం ఏమాత్రం నేరం చేయడం లేదు. ఇలాంటి బెదరింపులతో, అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. కంపెనీ రద్దయ్యే దాకా న్యాయం కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని పెద్ద ధన్వాడ గ్రామస్తులు తెలియజేశారు.
ఇథనాల్‌ కంపెనీని రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి
ఇథనాల్‌ కంపెని అనుమతులు రద్దు చేయాలని కోరుతూ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌కు అఖిలపక్షం నాయకులు వినతి పత్రం అందజేశారు. కంపెనీ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు గత 8 నెలలుగా శాంతియుతంగా వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నా, మాజి ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, జిల్లా అధికారులు పరిశ్రమను రద్దు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ప్రస్తుతం అధికారులు మాట తప్పడంపై అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని అఖిలపక్ష సామాజిక ప్రజాసంఘాల రాజకీయ పార్టీల నాయకులని బలవంతంగా నిర్బంధంలోకి తీసుకున్నారని విమర్శించారు. కావున ప్రజాభిప్రాయానికి విరుద్ధమైన ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణా అనుమతులు రద్దు చేసి రైతులపై దాడులకు పాల్పడ్డ కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి రైతులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు నాగర్‌ దొడ్డి వెంకటరాములు, సిపిఎం జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, కుర్వ పల్లయ్య, వాల్మీకి సింగరాజు మద్దిలేటి, సుభాన్‌, టవర్‌ మబ్బుల్‌, ఆంజనేయులు, జమ్మిచెడు కార్తీక్‌, బీరెల్లి దానయ్య, నాగన్న, ఉప్పేర్‌ నరసింహ, శ్యాం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
అల్లర్లు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేశాం : ఎస్‌ఐ
ఇథనాల్‌ కంపెనీ వాహనాలు నిప్పట్టించి, కూలీలపై దాడి చేసిన నిరసనకారులపై ఫ్యాక్టరీ సీఈఓ మంజునాథ్‌ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు 41 మంది నిరసన కారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్‌ తెలిపారు. దాడులకు పాల్పడిన 12 మందిని రిమాండ్‌కు తరలించగా, మరో 29 మంది నిరసన కారకులుగా గుర్తించి వారిపై కేసులు నమోదు కాగా మరికొందరు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

 

 

తాజావార్తలు