పెద్దధన్వాడ ఘటనలో మరికొందరు రైతులకు బెయిల్

గద్వాల నడిగడ్డ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి కేసులో ఏ3 నిందితుడుగా ఉన్న జైలర్ నాగరాజుతో పాటు మరికొందరు రైతులకు జిల్లా గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తి ఎన్. ప్రేమలత మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిలు మజూరు చేశారు. గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నేపథ్యంలో ఆయా  గ్రామస్తులకు కంపెనీ యాజమాన్యానికి మధ్య జరిగిన ఘర్షణలో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఎ3 నిందితునిగా అదే గ్రామానికి చెందిన జైలర్ నాగరాజు పేరును కూడా పోలీసులు చేర్చారు. కాగా ఈనెల 4న జరిగిన ఘర్షణలో తాను లేనని, తనకు ఆరోపిత దాడికి సంబంధం లేదని, సంఘటనకు ముందు రోజు సంఘటన జరిగిన రోజు తాను నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జైలు సూపరిన్డెంట్ గా విధి నిర్వహణలో ఉన్న విషయాన్ని తన న్యాయవాది మధుసూదన్ బాబు కోర్టుకు బెయిల్ పిటిషన్ ద్వారా దఖలుపరిచారు. నిందితుడు నాగరాజుకు ఈ నేరానికి ఎలాంటి సంబందం లేదని నేర స్థలంలో నాగరాజు లేడని, పైగా ఆయన క్రమం తప్పకుండా విధి నిర్వహణలో ఉన్నాడని ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గౌరవ జిల్లా న్యాయస్థానాన్ని మధుసూదన్ బాబు కోరారు. కాగా, ప్రభుత్వ న్యాయవాది జె.వినోదా చారి జైలర్ నాగరాజు ఏ3 తన గ్రామ ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయంతించాడని, ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని ముందస్తు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తన వాదన వినిపించారు. వాదోప వాదనలు విన్న కోర్టు జైలర్ నాగరాజుకు షరతుల తో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. నాగరాజుతో పాటు మరో 12 మంది పెద్ద దన్వాడ గ్రామ ప్రజలకు గౌరవ న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటి దాకా 25 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లయ్యింది. నాగరాజుతో పాటు మరి కొంతమందికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.