జైలర్ నాగరాజుపై దుష్ప్రచారం ఆపండి
స్వగ్రామంపై అభిమానం చూపడం నేరమా..?
అహోరాత్రులు శ్రమించి ఉద్యోగం సాధించిన బడుగుజీవిపై అక్కసు
విషపూరిత ఫ్యాక్టరీని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నది నిజం కాదా?
పెద్దధన్వాడ ఘటనను ప్రేరేపించారనే నెపంతో ఇబ్బందులు పెట్టడం సరికాదు
ప్రైవేటు సైన్యంతో గ్రామస్తులపై మొదట యుద్ధం ప్రకటించింది ఎవరూ..?
హైదరాబాద్/జోగులాంబ గద్వాల జిల్లా, జూన్ 07 (జనంసాక్షి) :
పుట్టిన గడ్డ, పెరిగిన ఊరి రుణం తీర్చుకోవాలని ఏస్థాయి వ్యక్తికైనా అభిమానం ఉంటుంది. అందుకే శ్రీమంతుడు చిత్రం చూసి ఎంతోమంది ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సైతం సొంతూరి కోసం ముందుకొచ్చారు. ఊరి అభివృద్ధిలో భాగస్వాములై తోచిన సహాయసహకారాలందించారు. స్వగ్రామంపై మమకారం ఉంటుందనడానికి ఇలాంటి ఎన్నో సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రస్ఫుటిస్తాయి. కానీ, ప్రజలకు విషపూరితమైన వాయువులను వెదజల్లే ఓ కాలుష్య కారక పరిశ్రమకు వ్యతిరేకంగా నిలిచాడనే నెపంతో బలహీనవర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని వేధిస్తుండటం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ బోయ కులానికి చెందినవాడు ఉన్నతోద్యోగం చేస్తున్నాడనే అక్కసుతో గిట్టనివారు దుష్ప్రచారానికి ఒడిగట్టడం దుర్మార్గమని స్థానిక ప్రజలు ఆగ్రహిస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పట్ల ప్రజాగ్రహం పెల్లుబికిన విషయం విదితమే. గత పది నెలలుగా చుట్టుపక్కల 12 గ్రామాలు ఫ్యాక్టరీ వద్దంటే వద్దంటూ ఉద్యమిస్తున్నారు. ఈయేడు జనవరిలో రిలేదీక్షలు కూడా చేపట్టారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సందర్భాల్లో వినతులు కూడా అందించారు. చివరకు కాంగ్రెస్ నేతలు, అధికారుల హామీ మేరకు రిలే దీక్షలు విరమించిన ప్రజలు.. ఇటీవల ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు పూనుకోవడంతో తీవ్రంగా ప్రతిఘటించారు. మంగళవారం అర్ధరాత్రి తెల్లవారుజామున ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దింపిన యాజమాన్యం.. కంటైనర్లు, ఫ్యాక్టరీ కోసం సామాగ్రిని అక్కడకు తీసుకొచ్చింది. అదేరోజు విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున మరోసారి ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ పెట్టబోమని మాటిచ్చి తప్పారని రైతులంతా మండిపడ్డారు. అయితే ఫ్యాక్టరీ తెచ్చిన ప్రైవేటు సైన్యం గిరిగీసి రావాలని సవాల్ చేయడం, అక్కడ ఏర్పాట్లకు పూనుకోవడంతో మరింత ఆగ్రహించిన ప్రజలు మరుసటి రోజు బుధవారం నాడు ఉదయం ఐదారు గ్రామాల ప్రజలు సుమారు రెండువేల మంది తరలివచ్చారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ ప్రైవేటు సైన్యం ఓ మహిళ తలపై కర్రలతో దాడిచేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజాగ్రహం పెల్లుబికడంతో అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేసి కంటైనర్కు నిప్పుపెట్టారు. మా పల్లెలను పాడుచేసే పరిశ్రమ వద్దంటూ పెద్దఎత్తున నినదించారు. ఈ ఘటన నేపథ్యంలో 40 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నాగర్కర్నూల్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు ప్రజలను ప్రేరేపించాడని ఆయనను ఏ3 నిందితుడిగా చేర్చారు. దొరికిందే అదనుగా బోయ కులానికి చెందినవాడని గిట్టనివారు దుష్ప్రచారం మొదలుపెట్టారు.
ప్రజాగ్రహం చెబితే వచ్చింది కాదు..!
పెద్దధన్వాడకు చెందిన జైలర్ నాగరాజు బీసీ బోయకులానికి చెందినవాడు. అహోరాత్రులు శ్రమించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఎన్నో కష్టాలను అధిగమించి సర్కారు కొలువు పొంది ఊరి ప్రజల మెప్పు పొందాడు. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రజలను ప్రేరేపించాడని కొన్ని మీడియా సంస్థలు చౌకబారు వార్తలను ప్రచురణ చేయడం, పోలీసులు సైతం అదే కోణంలో ఆయనను నిందితుడిగా చేర్చడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత పది నెలలుగా 12 గ్రామాల ప్రజలు పోరాడుతున్నది నిజం కాదా? గ్రామం, గ్రామస్తులపై అభిమానం చూపితే ప్రేరేపించడం ఎలా అవుతుంది? ఎవరో కొందరు వ్యక్తులు చెబితే ఇంత పెద్దఎత్తున ప్రజాగ్రహం వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఊరిలో పుట్టిపెరిగి, విధి నిర్వహణలో నిబద్ధత, నిక్కచ్చిగా ఉండే నాగరాజుపై లేనిపోని అబాంఢాలు మోపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రజలపై మొదట యుద్ధం ప్రకటించి, ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చిన యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాగరాజు విషయంలో పోలీసులు పునరాలోచన చేసి ఆయనపై కేసు ఎత్తివేయాలని, ఒకవేళ ఆయనపై చర్యలు చేపడితే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.