సర్వే ఆధారంగా ప్రాసెసింగ్ యూనిట్లు
రైతులకు గిట్టుబాటు ధరలు..మహిళలకు ఉపాధి
సమగ్రరైతు సర్వే లక్ష్యాలను వివరిస్తున్న అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్24(జనంసాక్షి): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు వ్యవసాయ సమాయత్తమవుతోంది. రైతులు ఎంత పంట పండిస్తున్నారు, మన అవసరాల వినియోగం, ఎగుమతి, దిగుమతుల వివరాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. వీటి ఏర్పాటు ద్వారా మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తామని సిఎంకెసిఆర్ గతంలోనే ప్రకటించారు. ఇటు
రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం, అటు మహిళలకుఉపాధి చూపడంద్వారా ఇద్దరి సమస్యలు తీరుతాయని సిఎం కెసిఆర్ తెలిపారు. వచ్చే ఖరీఫ్ పంటలు పూర్తికాగానే ఈ కార్యాచరణ చేపట్టేందుకు సర్వే చేస్తున్నారు. ఇందుకోసమే రైతు సమగ్ర సర్వేచేపట్టారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడంతో పాటు ఎక్కడా నష్టం జరగ కుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ కమిషన్, ప్రిన్సిపుల్ సెక్రటరీలు ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే మే 15వ తేదీ కల్లా పూర్తి కావాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో పట్టాదారుపాస్ పుస్తకాలు ఉన్న రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చేందుకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ ఆదేశాల మేరకు మే 20వతేదీ కల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో పాస్బుక్లు పంపిణీ చేసిన రైతుల వివరాలను మాత్రమే ఈ సర్వేలో సేకరించేందుకు వ్యవసాయశాఖ నిర్ణయించింది. కొంతమందికి పట్టాదారు పాస్పుస్తకాలు రావాల్సి ఉండగా అవి వచ్చిన తరువాత రైతుల వివరాలను ఆన్లైన్ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 97 వేల మంది రైతుల వివరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మండల స్థాయిలో ఏఈవోలు కొత్తగా వచ్చిన 40 రకాల ఫార్మ్యాట్తో సర్వేను కొనసాగిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో పంట వివరాలు, వేసవిలో పంట వివరాలు, వేసవిలో కూరగాయల సాగు, తోటల విస్తీర్ణం, 2019 వానాకాలం నాటికి ప్రతిపాదించిన పంటలు, పంటబీమా, దగ్గరలో ఉన్న వారపు సంతలు, కుటుంబ సభ్యులు స్వయం సహాయక సంఘాల గ్రూపులో ఉన్నారా, లేదా, రైతుకు ఫోన్ ఉందా, లేదా, సేంద్రీయ వ్యవసాయం గురించి వారికి తెలుసా అనే అంశాలను ఈ ఫార్మాట్లో పొందుపర్చారు.
జిల్లాలోని 23 మండలాల్లో సంబంధిత ఏఈవోలు ఈ సేకరణ చేపట్టారు. ప్రతీ రైతు వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడంతో పాటు వారి ఆధార్ వివరాలను కూడా రైతు డిక్లరేషన్తోటే తీసుకొని పాస్బుక్ వివరాలను నమోదు చేస్తున్నారు. ట్టాదారు పాస్పుస్తకాలు ఉన్న రైతులు జిల్లాలో 97 వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.