తేజస్విన్‌కు ‘ఎంట్రీ’ నిరాకరణ.. కారణమిదే!

కోర్టు ఉత్తర్వులతో కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లేందుకు సిద్ధమైన భారత హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్‌నుంచి అతని ఎంట్రీని తిరస్కరిస్తున్నట్లు కామన్వెల్త్‌ నిర్వాహకులు ప్రకటించారు. నిబంధనల ప్రకారం తేజస్విన్‌ ఎంట్రీ ఆలస్యం కావడమే అందుకు కారణం.

అర్హత మార్క్‌ సాధించినా… భారత్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌లో పాల్గొనలేదనే కారణంతో తేజస్విన్‌ పేరుకు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య పంపలేదు. అయితే తేజస్విన్‌ కోర్టుకెక్కడంతో 400 మీటర్ల రన్నర్‌ అయిన అరోకియా రాజీవ్‌ స్థానంలో తేజస్విన్‌ను ఎంపిక చేశారు.

అయితే సీడబ్ల్యూజీ నిబంధనల ప్రకారం ఒకరికి బదులుగా మరొకరిని ఎంపిక చేస్తే అదే ఈవెంట్‌కు చెందిన ఆటగాడు అయి ఉండాలి. రన్నర్‌కు బదులుగా హైజంపర్‌ను అనుమతించేది లేదని నిర్వాహకులు భారత ఒలింపిక్‌ సంఘానికి సమాచారమందించారు.