తొలి అడుగు వేశాం

` అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లాతో ప్రభాని మోదీ సంభాషణ
` ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తోందని, ఒక్క రోజులో 16 సూర్యోదయాలు చూస్తున్నానని ప్రధాని వివరించి వ్యోమగామి
న్యూఢల్లీి(జనంసాక్షి): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్‌ఎస్‌)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లాతో ప్రభాని నరేంద్ర మోదీతో జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది.ఈరోజు(శనివారం, జూన్‌ 28వ తేదీ) శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. తొలుత శుభాంశును విష్‌ చేసిన ప్రధాని మోదీ.. ‘ఇది శుభ్‌ ఆరంభ్‌ అని, ఇది నయా శకం’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోదీ.. గొప్ప ఘనతను సాధించావంటూ కొనియాడారు. దానికి శుభాంశు బదులిస్తూ ఇది తన ఒక్కడి విజయం కాదని, భారత్‌ విజయమని వినమ్రతను చాటుకున్నారు. అదే సమయంలో అక్కడ ఎలా ఉంది అని మోదీ అడగ్గా… ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉందని శుభాంశు తెలిపారు. ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు స్పష్టం చేశారు. ఇక్కడ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కక్షలో పరిస్థితులకు అలవాటు పడుతున్నామని, నిద్ర పోవడం అనేది చాలా పెద్ద చాలెంజ్‌గా ఉందన్నారు.ఇక్కడ గ్రావెటీ లేమి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని శుభాంశు తెలిపారు. తల కాస్త భారంగా ఉంటుందని, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులేనని తెలిపారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఐఎస్‌ఎస్‌లో అతి సులభంగా అడుగుపెట్టానని పేర్కొన్నారు శుభాంశు. ఇక ఐఎస్‌ఎస్‌ నుంచి భారత్‌ చాలా పెద్దదిగా కనిపిస్తుందని, మ్యాప్‌ కంటే భిన్నంగా ఉందని మోదీ పేర్కొనగా, ఇక్కడ నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు తెలిపారు. ఇలా పలు విషయాలను పంచుకుంటూ ప్రధాని మోదీ-శుభాంశుల సంభాషణ కొనసాగింది.