పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. రఘురామకృష్ణరాజు కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆందోళనతో పీఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రూప్-1 కేసులో మాత్రం ఊరట
ఇదిలా ఉండగా, ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించిన మరో కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను న్యాయస్థానం మరో రెండు నెలల పాటు పొడిగించింది.
ఇదే గ్రూప్-1 కేసులో రెండో నిందితుడిగా ఉన్న క్యామ్సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పైనా హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ గాల్ బ్లాడర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ వై. లక్ష్మణరావు, మధుసూదన్కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని విజయవాడ జైలు సూపరింటెండెంట్ను ఆదేశించారు. తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేశారు.