నీటి వాటా తెలంగాణ జన్మహక్కు

` రాజీపడే ప్రసక్తేలేదు
` కిషన్‌రెడ్డి పరోక్షంగా ఆంధ్రాకు సహకరిస్తున్నారు
` బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం పూర్తిగా తిరస్కరించలేదు
` తెలంగాణకు మరణశాసనం రాసిన కేసీఆర్‌, హరీశ్‌
` గోదావరి మిగులు జలాలపై ఏపీకి అనుకూలంగా నిర్ణయం
` రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలం
` కాళేశ్వరంతో లక్షకోట్లు వృధా చేశారు
` దానికి మరమ్మతులు చేయాలంటే మరో రూ.50వేల కోట్లు కావాలి
` మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి
` జగన్‌ దిగిపోగానే సెంటిమెంట్‌తో కేసీఆర్‌ రెచ్చగొడుతున్నారు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాష్టాన్రికి చెందిన నీటిహక్కులు కాపాడటంలో రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ప్రజాభవన్‌లో ’గోదావరి-బనకచర్ల’పై ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ప్రజాభవన్‌ లో బనకచర్ల ప్రాజెక్టు పైనా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘నీటిపారుదల శాఖను పదేళ్లపాటు కేసీఆర్‌, హరీశ్‌రావు చూశారు. రాష్ట్ర నీటి హక్కులను వాళ్లు కాపాడతారని అందరూ భావించారు. కానీ వాళ్లే నష్టం చేశారు. 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని.. 68 శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదని 2015లో సంతకం చేశారు. 2015లో కేసీఆర్‌, హరీశ్‌రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయి. కృష్ణా పరివాహక ప్రాంతం పరంగా చూస్తే తెలంగాణకే ఎక్కువ దక్కాలి. ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో కేటాయించిన 299 టీఎంసీలు కూడా వాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన ప్రాజెక్టులను పదేళ్లపాటు పట్టించుకోలేదు. ఏపీ మాత్రం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులకు నీటిని తరలించుకుపోతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. నీళ్ళకు తెలంగాణ ప్రజలకు అనుబంధం ఉంది.. నీళ్లలో జరిగిన అన్యాయం పైనే తెలంగాణ ఉద్యమం కొనసాగింది.. నీళ్ల విషయంలో అందరిదీ ఏకాభిప్రాయమే.. తెలంగాణ హక్కులు కాపాడాలనేది మా ఆలోచన అన్నారు. అయితే, కేసీఆర్‌, హరీష్‌ రావుల దగ్గరే తొమ్మిదిన్నరేళ్ల పాటు నీటి పారుదల శాఖ ఉంది.. వాళ్ళ విూద పెట్టిన నమ్మకం వమ్ము చేశారు.. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకి గుది బండలాగా మారింది.. నికర జలాల విూద కేటాయింపుల్లో స్పష్టత ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. ఇక, కృష్ణా నదిలో 811 టీఎంసీలలో 299 టీఎంసీలు తెలంగాణకు చాలు అని కేసీఆర్‌ సంతకం చేసి వచ్చిండు అని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆరోపించారు. అప్పుడు కూడా మేం అభ్యంతరం వ్యక్తం చేశాం.. పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు చేయాలని మేం వాదించాం.. 2020లో కూడా 299 టీఎంసీలు చాలు అని చెప్పారు.. కేసీఆర్‌, హరీష్‌ రావులు నీటి కేటాయింపులు సాధించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి చేయలేదు.. కేంద్రానికి కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ముందుకు రాలేదు.. కేసీఆర్‌ తన దాహం తీర్చుకోవడానికి.. కాళేశ్వరం పేరుతో అంచనాలు మార్చాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి షేప్‌ రావాలంటే.. ఇంకో 50 వేల కోట్లు కావాలి.. లక్ష కోట్లు ఖర్చు చేసి 50 వేల ఎకరాలకు నీరు ఇచ్చారు .. 7 వేల కోట్ల కరెంట్‌ బిల్లులు అయ్యాయి.. మరో 118 టీఎంసీల నీటిని సముద్రంలో కలిపారని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, గోదావరిని పూర్తిగా వాడుదామంటే నీళ్ల కేటాయింపు సమస్య, నిధుల సమస్య వస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ చెప్తున్న అబద్దాలు.. విూరు జనంలోకి తీసుకెళ్లాలి అని
సూచించారు. నదులు పునరుజ్జీవం కోసం కాదు.. బీఆర్‌ఎస్‌ పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. అందుకు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.. ఫామ్‌ హౌస్‌ లో ఉండి క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమాభారతి దగ్గరకి వెళ్లి 3 వేల టీఎంసీల నీళ్ళు ఉన్నాయని కేసీఆర్‌ అన్నాడో అప్పుడే సమస్య మొదలైంది. చంద్రబాబు మేల్కొని.. తెలంగాణనీ ఇరకటంలోకి నెట్టిండు.. చంద్రబాబు వచ్చినా.. జగన్‌ వచ్చినా.. గోదావరి నీళ్లు తీసుకుపోతామన్నారు.. రోజా ఇంటికి వెళ్ళి.. గోదావరి నీళ్లు ఇస్తామని కేసీఆర్‌ అన్నారు.. కేసీఆర్‌ వైఖరి.. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు.. విూ ఇంటికి వస్తె ఏం ఇస్తావు అన్నట్టు ఉందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వ విజయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని.. అందుకే బనకచర్ల ప్రాజెక్ట్‌?కు పర్యావరణ అనుమతులు తిరస్కరించిందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వాదనలు పూర్తిగా అవాస్తమని అన్నారు. కాగా, ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌?కు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధప్రదేశ్‌కు తేల్చిచెప్పింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్ట్‌ కోసం ఆంధప్రదేశ్‌ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) పరిశీలించాల్సి ఉందని.. ఈ మేరకు సీడబ్ల్యూసీని అప్రోచ్‌ కావాలని ఏపీకి సూచించింది. సీడబ్ల్యూసీతో కలిసి ప్లడ్‌ వాటర్‌ అవేలబులిటి అస్సెస్‌ చేయాలని పేర్కొంది. అంతరాష్ట్ర జల వివాదానికి క్లియరెన్స్‌ తెచ్చుకోవాలని ఆంధప్రదేశ్‌కు సూచించిందని అన్నారు.