ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ ఇకలేరు

` ముఖ్యమంత్రి రేవంత్‌ తదితరుల సంతాపం
హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్‌ ప్రసిద్ధి. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్‌ ఉన్నారు. పట్టాభిరామ్‌ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు. ఖైరతాబాద్‌లోని స్వగృహంలో పట్టాభిరామ్‌ పార్థివదేహాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.బీవీ పట్టాభిరామ్‌.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్‌ సాహెబ్‌’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని పదిహేను మందిలో ఒకరు. కౌమారదశలో కాలి వైకల్యంతో కలిగిన ఆత్మన్యూనతా భావాన్ని జయించి తనని తాను ఇంద్రజాలికుడిగా, రచయితగా తీర్చిద్దుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్‌ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసేవారు. 1970 దశకం నాటికి స్వతంత్రంగా రెండుమూడు గంటలపాటు ప్రేక్షకులను కదలనీయకుండా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి పట్టాభిరామ్‌ ఎదిగారు.1984లో హైదరాబాద్‌లో కళ్లకు గంతలు కట్టుకుని రవీంద్రభారతి నుంచి చార్మినార్‌ వరకు స్కూటర్‌ నడిపి ఇంద్రజాల విద్యలో తెలుగునేలపై కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. హిప్నాటిజాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి పలు రుగ్మతలను పోగొట్టవచ్చని నిరూపించారు. అప్పటి సీఎం ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో ఇంద్రజాలాన్ని జోడిరచి ప్రభుత్వ పథకాలకు, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలకు ప్రచారం కల్పించారు. గోదావరి వరద బాధితుల కోసం ప్రదర్శనలు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. దూరదర్శన్‌లో కొన్ని సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో నటించారు. జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘రెండురెళ్లు ఆరు’లోనూ డాక్టర్‌ పట్టాభిరామ్‌గానే కనిపించారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు శోభన్‌ బాబు, అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. పలు పత్రికల్లో బీవీ పట్టాభిరామ్‌ వ్యక్తిత్వ వికాస వ్యాసాలు రాశారు.
చంద్రబాబు, బండి సంజయ్‌, పవన్‌, లోకేశ్‌ సంతాపం
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ సంతాపం ప్రకటించారు. పట్టాభిరామ్‌ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చంద్రబాబు, లోకేశ్‌ అన్నారు. ఇంద్రజాలికుడిగా, హిప్నాటిస్టుగా, సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనర్‌గా ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.
బీవీ పట్టాభిరామ్‌ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇంద్రజాలికుడిగా, సైకాలజిస్టుగా ఐదు దశాబ్దాలపాటు సమాజానికి ఆయన సేవలందించారని చెప్పారు. పట్టాభిరామ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.పట్టాభిరామ్‌ మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా వినోదాన్ని పంచడమే కాకుండా మూఢ నమ్మకాలు పారదోలేలా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. వ్యక్తిత్వ వికాసం, మనస్తత్వ శాస్త్రంపై పలు రచనలు చేశారన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు.