నేటి నుంచి జీవ వైవిధ్య సదస్సు

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు తొలిఘట్టం ఉదయం పది గంటలకు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభం కానుంది. 193 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ఈ నెల 19వ తేదీ వరకూ జరగనుంది. ఇందులో తొలి అంకమైన ‘ జీవ భద్రత ‘ సంబంధిత అంశాలపై 5 రోజుల పాటు చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ జీవ భద్రత సదస్సును రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రారంభించనున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జయంతీ నటరాజన్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు. 2003 సెప్టెంబర్‌ 11 నుంచి  అమల్లోకి వచ్చిన కార్టెజెనా ఒప్పందం, ఆ తదుపరి సదస్సుల్లో చేసిన  తీర్మానాలు, అమలు పరిస్థితి, చేయాల్సిన మార్పులపై ప్రతినిధులు ప్రధానంగా చర్చిస్తారు. అధునిక జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూపుదిద్దుకున్న పంటలు, జీవజాతుల ద్వారా జీవ వైవిధ్యానికి రాగల ముప్పు నుంచి రక్షించుకునేందుకు కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికనే  వ్యవహరిస్తున్నారు.