పంటనష్టానికి పరిహారం

` నివేదికలు అందగానే రూ.10వేలు సాయమందిస్తాం
` రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం: తుమ్మల
` ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం తగదని హితవు
హైదరాబాద్‌(జనంసాక్షి): అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఓ ప్రకటనలో వివరించారు. పదేళ్లపాటు అస్తవ్యస్త విధానాలతో రైతులను అగమ్యగోచరంగా చేశారని.. ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.పదేళ్లలో ఏనాడు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వని వాళ్లు ఇవాళ విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కేవలం ఎన్నికలకు ముందు రూ.150 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారని.. రెండో మారు జీవో మాత్రమే ఇచ్చి చేతులు దులుపేసుకున్నారని ఆరోపించారు. మూడోసారి కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని దుయ్యబట్టారు. గత మే నెల వరకు కూడా రైతుబంధు నిధులు జమ చేసిన నేతలు.. ఇవాళ తమను తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల అభ్యంతరం వ్యక్తం చేశారు.