ప్రజలను మోసగిస్తున్న వైయస్‌ఆర్‌ సిపి

గుంటూరు, జూలై 28 : వైయస్సార్‌ పార్టీ పుట్టుకే అనైతికం, అక్రమమని వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతీ రోడ్డులోని బత్తిన కళ్యాణమండపంలో ప్రత్తిపాడని నియోజకవర్గ కార్యకర్తల నియమాక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రికన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్సార్‌ పార్టీ నాయకులు కాంగ్రెసు పథకాలను తమ పథకాలుగా చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారన్నారు. నిజానికి ఆ పథకాలు నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లు ప్రవేశపెట్టినవన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఒనగూరేదేమిలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పూర్వవైభవనానికి మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సూచనలు వెంటనే అమలు చేస్తున్నామన్నారు. గుర్తింపుకార్డులను చూపితే నాయకులు ముందుగా వారికే ప్రాధాన్యం ఇస్తారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడే వరి అన్నం అందరికి అందుబాటులో ఉండేది కాదని, కాంగ్రెస్‌పాలనలో అందరికి అందుబాటులో ఉండేది కాదని, కాంగ్రెస్‌ పాలనలో అందరికీ ఆహార భద్రత కల్పించామన్నారు. రూపాయికే కిలో బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్‌కే సొంతమన్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కొల్పోయినా సుధాకర్‌ నిరాశపడకుండా కార్యకర్తలతో కలసి ముందుకు సాగడం శుభపరిణామమన్నారు. ఇలానే కృషి చేస్తే భవిషత్తులో విజయం తథ్యమన్నారు. ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాసు మాట్లాడుతూ, కార్యకర్తలు పార్టీకి గుండెకాయవంటి వారన్నారు. వారిని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్‌ఛార్జి సుధాకర్‌ బాబు మాట్లాడుతూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీని కార్యకర్తలను అంటిపెట్టుకొని ఉంటానన్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా వాళ్ళ గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. అనంతరం గోరంట్ల పంచాయితీ పరిధిలోని పలువార్డుల్లో ఏర్పాటు చేసి వారికి గుర్తింపుకార్డులను కన్నా చేతుల మీదగా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తులసీరామచంద్రప్రభు, జయరాంబాబు, శ్రీనివాసరెడ్డి, ఈశ్వరరావు, కాశీవిశ్వనాథం, పి.వి.రావు, ఎంరాదా, కె. వెంకట్‌, ఇంద్ర, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.