యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఖమ్మం, అక్టోబర్‌ 30 : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నామా యూత్‌ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి సృజన్‌కుమార్‌  విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దీవాలకోరు విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. నామా యూత్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో జరిగే వస్తున్నా మీ కోసం పాదయాత్రను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీని 2014 ఎన్నికల్లో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన కోరారు. టిడిపి హయాంలో విద్యుత్‌ కోతలు ఏమీ లేవని, ఇప్పుడు రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు ఉన్నా కూడా కరెంటు కోతలు విధిస్తున్నారని విమర్శించారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కారణంగా ప్రజలు రోగాల భారీన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని ఆయన విమర్శించారు.