లండన్‌లో భారత్‌కు రెండో పతకం

-షూటింగ్‌లో విజయ్‌కుమార్‌కు రజతం
లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ రెండో పతకం సాధించింది. పురుషుల 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ భారత షూటర్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం రజత పతకం సాధించాడు. ఇప్పటికే షూటింగ్‌లో హైద్రాబాద్‌కు చెందిన గగన్‌నారంగ్‌ పతకం సాధించిన విషయం తెలిసిందే. లండన్‌ ఒలంపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్‌ సాధించిన రెండు పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయి. మొదటగా గగన్‌నారంగ్‌ కాంస్య పతకం సాధించగా విజయ్‌ కుమార్‌ రెండో పతకం సాధించాడు. ఫైనల్‌ ఎనిమిది సిరీస్‌ల్లో 26 ఏళ్ల విజయ్‌కుమార్‌ 5,4,4,3,4,4,4,2తో 30స్కోర్‌ సాధించాడు. క్యూబాకు చెందిన లూరిస్‌ పుపో 34 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం సాదించాడు. క్వాలిఫైంగ్‌ రెండో దశ పోటీల్లో శుక్రవారం ఉదయం విజయ్‌ 585 స్కోరుతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోరు 583 మాత్రమే.గురువారం క్వాలిఫైయింగ్‌ మొదటి దశలో 293 స్కోర్‌ సాధించాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో విజయ్‌ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. అయితే తమ కుమారుడు పరతకం సాధించడం పట్ల విజయ్‌కుమార్‌ తల్లితండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.