వృత్తినైపుణ్యం పెంపొందించుటకే శిక్షణ తరగతులు

కరీంనగర్‌, జూలై 27 : గ్రామీణ విలేకర్లకు వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు శిక్షణ తరగతులు ఎంతో దోహదపడుతాయని శాతవాహన యూనివర్సిటీ వైస్‌-చాన్స్‌లర్‌ కె.వీరారెడ్డి అన్నారు. ప్రెస్‌ అకాడమి, శాతవాహన యునివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మెట్‌పల్లిలోని జ్ఞానోదయ డిగ్రీ కాలేజిలో గ్రామీణ విలేకర్లకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతులను శుక్రవారం వైస్‌ చాన్స్‌లర్‌ కె. వీరారెడ్డి ముఖ్య అతిధిగా హాజరు అయి జ్యోతి ప్రజ్వలన చేసిన తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలేకర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చుటకు రోజులు పెంచాలని సూచించారు. సమాజంలో జరుగుచున్న అక్రమాలను వెలికితీసి, వాటిని అరికట్టుటకు విలేకర్లు కృషి చేయాలని అన్నారు. కలానికి ఉన్న బలం దేనికి లేదని ప్రజలకు ఉపయోగపడేలా, పత్రికలలో విషయ సంబందమైన వార్తలు వ్రాయలని అన్నారు. ప్రెస్‌ అకాడమి చైర్మెన్‌ తిరుమలగిరి సరేందర్‌ మాట్లాడుతూ ఉత్తమ విలేకర్లుగా తీర్చిదిద్దుటకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రెస్‌ అకాడమి ద్వారా నూతనంగా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుండి రెండు కొత్త కోర్సులు ప్రవేశపెట్టమని అన్నారు. పొట్టిశ్రీరాములు యునివర్సిటీలో ఎంపిక చేసిన విలేకర్లకు ఎం.సి.జె. కోర్సును పూర్తి చేయుటకు ప్రెస్‌ అకాడమి ద్వారా ఫీజులు చెల్లిస్తున్నామని అన్నారు. 100 సంవత్సరాలకు పూర్వం ఉన్న పత పత్రికలకు సంబంధించినవి డిజిటలైజేషన్‌ చేస్తున్నామని 1977 వరకు 14లక్షల పేజీలను ప్రెస్‌ అకాడమి వైబ్‌సైట్‌లో పొందుపరిచినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి కార్యదర్శి జి. సన్యాసిరావు, వరంగల్‌ ప్రాతీయ సంయుక్త సంచాలకులు, కె.మనోహరచారి, ప్రెస్‌ అకాడమి చైర్మెన్‌ పిఎస్‌ రహమన్‌, మేనేజర్‌ పి. బాస్కర్‌ తదితరుల పాల్గొన్నారు.