సీమాంధ్ర బఫూన్‌ లగడపాటి

సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో లగడపాటిని ఒక జోకర్‌గా ప్రజలు భావిస్తున్నారని టీిఆర్‌ఎస్‌ ఎల్‌పి ఉప నేత టి.హరీష్‌రావు అన్నారు. సోమవారంనాడు ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లగడపాటికి అన్నీ కల్లిబొల్లి కబుర్లు అని కొట్టిపారేశారు. ఆయనకు తెలంగాణ ఎల్లలు తెల్వవని, అలాంటి వ్యక్తి తెలంగాణపై పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం మానుకోవాలన్నారు. తెలంగాణ గురించి మాట్లాడేందుకు రాజగోపాల్‌ ఎవరని, ఆయనకు ఉన్న హక్కేమిటని హరీష్‌రావు సూటిగా ప్రశ్నింఛారు. పార్టీ పరంగా మాట్లాడితే పరిగణనలోకి తీసుకుంటామని, అదే వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం పట్టించుకోబోమని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ వాదాన్నే బలపర్చారని, కాంగ్రెస్‌ పార్టీని అక్కడి ప్రజలు ఓడించడమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సమైక్యవాద పార్టీలకు కాలం చెల్లిందన్నారు. పరకాల ఉప ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమైందని ఆయన అన్నారు. పరకాల ఎన్నికల్లో అన్ని పార్టీలు తెలంగాణ వాదంతోనే పోటీ చేశాయని, తెలంగాణ పేరుతోనే ఓట్లను వేయించుకున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణపై గల్లీలో ఒక మాట.. ఢిల్లీలో ఒక మాట మాట్లాడడం పరిపాటైందని, ఈ వైఖరి సరికాదని ఆయన పేర్కొన్నారు.