అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

దేవరకొండ: మండల పరిధిలో ఒక రైతు అప్పుల బాధ భరించలేక సోమవారం క్రిమి సంహార మందు తాగి మృతి చెందాడు. పడమటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లారెడ్డి బావి గ్రామానికి చెందిన లాలయ్యకు మూడెకరాల పొలం ఉంది. వేసవి కావటంతో పొలంలో ఉన్న బావిలో నీరెండిపోయింది. దీంతో పంటను సాగుచేసేందుకు రూ. 50వేలు అప్పు తీసుకుని ఆదివారం రెండు బోర్లు వేశాడు. రెండు బోర్లలోనూ చ్కు నీరు రాకపోవటంతో అసహనానికి లోనయ్యాడు. ఆదివారం రాత్రి పొలం దగ్గరే నిద్రించి సోమవారం తెల్లవారు జామున పొలంలో ఉన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవరకొండ పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శవపంచనామా చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు. తమకు ఆర్థిక సాయం అందించి తమను ఆదుకోవాలని కోరుతూ మృతుని కుటుంబ సభ్యులు దేవరకొండ తహశీల్దారు ఎం వెంకన్నకు వినతి పత్రం అందజేశారు.