అవినీతి మంత్రులకు సీఎం రక్షణ కల్పిస్తున్నారు: భాజపా

నల్గొండ(వి.టి.కాలనీ): అవినీతి మంత్రులకు సీఎం రక్షణ కల్పిస్తున్నారని  భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్గొండలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్యాబినెట్‌ సమావేశాలు మూడు, నాలుగు నెలలకొకసారి నిర్వహించిన ఘనత కిరణ్‌కుమార్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో మంత్రులే ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించడం ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అవినీతి కుంభకోణాల మయంగా మారిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాజాపా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, నాయకులు మనోహర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి ఓరుగంటి రాములు తదితరులు పాల్గొన్నారు.