ఆర్టీసీ కార్మికులకు చేయూత

జనగామ,నవంబర్‌19(జనం సాక్షి): ఆర్టీసీ సమ్మెలో పాల్గొని జీతాలు లేక తీవ్ర ఇబ్బందుల పడుతున్న 520 మంది జనగామ డిపో కార్మికులకు జనగామకు చెందిన సాధిక్‌ ఫౌండేషన్‌ ద్వారా వారం రోజులకు సరిపడు నిత్యావసర సరుకుల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ ఎండీ సాధిక్‌ అలీ దీక్ష శిబిరంలో కార్మికులకు నిత్యావసర సరుకుల ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 46వ రోజు విజయవంతంగా కొనసాగింది. సమ్మెలో పాల్గొన్న కార్మికులు శిబిరంలో ఒకరోజు నిరాహార దీక్షతో ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం సమ్మెపై స్పందించే వరకు పోరాటం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆర్టీసీ కార్మికుల దీక్షలకు సాధిక్‌ ఫౌండేషన్‌తోపాటు పలు ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.