ఈవీఎం ధ్వంసమైనా నష్టమేమీలేదు

` పోలింగ్‌ డేటా భద్రంగానే ఉంది
` ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం
` కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించాం
` 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టాం
` ఏడేళ్ల జైలు ఖాయమన్న సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా
అమరావతి,మే22(జనంసాక్షి):పోలింగ్‌ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ విూనా తెలిపారు. అమరావతిలో ఆయన విూడియాతో మాట్లాడుతూ..ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి సిట్‌కు పోలీసులు అన్ని వివరాలను అందించారు. 20న రెంటచింతల ఎస్‌ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదు అయిన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేవిూ దాచిపెట్టలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించాం అని సీఈవో స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వేఛ్చాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ దీనిని గుర్తించిందని సీఈవో తెలిపారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్‌ నంబర్‌ 202తో పాటు 7 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. రాష్ట్ర ఎన్నికల అధికారికి నోటీసులు పంపింది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని.. అలాగే ఈ ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఈ ఘటనపై సాయంత్రం ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించాలని సీఈవో ముఖేష్‌ కుమార్‌ విూనాను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయకుండా కఠినంగా వ్యవహరించాలని ఈసీ ఆదేశించింది.