ఈ మొక్క మహా వృక్షం కావాలి

– జనంసాక్షి దినపత్రిక బేష్‌
– సెక్షన్‌ కోర్టు జడ్జి మంగారి రాజేందర్‌
కరీంనగర్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు ప్రజల పక్షం వహించి, ప్రజల గొంతుకగా నిలువాలని సెక్షన్‌ కోర్టు జడ్జి మంగారి రాజేందర్‌ ఆకాంక్షించారు. కరీంనగర్‌ నుంచి వెలువడుతున్న మన జనంసాక్షి పత్రిక కార్యాలయాన్ని, వెబ్‌సైట్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. పత్రిక నడుస్తున్న తీరును చూసి జడ్జి అభినందించారు. అనతి కాలంలోనే ఈ పత్రిక ఇంతగా అభివృద్ధి చెందడం కొనియాడదగ్గ విషయమని ప్రశంసించారు. ప్రస్తుతం మొక్కగా ఉన్న జనంసాక్షి మహా వృక్షంగా ఎదగాలని ఆయన అభిలషించారు. ప్రజా సమస్యలను వెలికితీసి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో చురుగ్గా పని చేయాలని, అప్పుడు వృత్తిరీత్యా సంతృప్తి కలుగుతుందని సూచించారు. పత్రికలే ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తాయని, ఆ ధర్మాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సిబ్బందితో ముచ్చటిస్తూ వెల్లడించారు. జనంసాక్షి పత్రికలో ఇప్పటి వరకుఏ ప్రచురితమైన వార్తలను చూసి జడ్జి అభినందించారు. జడ్జి రాజేందర్‌కు జనంసాక్షి పత్రిక ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.