ఉద్యమ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్‌

– జహంగీర్‌ పీర్‌ దర్గాను సందర్శించిన ముఖ్యమంత్రి

– ఛాదర్‌, 52 పొట్టేళ్లతో మొక్కు చెల్లింపు

రంగారెడ్డి,నవంబర్‌ 10,(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌ పీర్‌ దర్గాను శుక్రవారం సీఎం కేసీఆర్‌ సందర్శించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆవిర్భవిస్తే.. 52 పొట్టేళ్లు సమర్పిస్తానని కేసీఆర్‌ మొక్కుకున్నారు. ఈ మేరకు సీఎం మొక్కు చెల్లించుకొని న్యాజ్‌ నిర్వహించారు. దర్గాను దర్శించుకున్న కేసీఆర్‌.. పూల ఛాదర్‌ను సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, దట్టీలను సమర్పించారు. అనంతరం అక్కడ ముస్లిం మతపెద్దలు, స్థానికులతో ముచ్చటించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మా రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, వినోద్‌, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు. సీఎం కేసీఆర్‌ రాక సందర్భంగా దర్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్గాలోకి సీఎం వెళ్లేందుకు ప్రత్యేక తాత్కాలిక దారి, దర్గా ఆవరణలో న్యాజ్‌ భోజనాలు చేసేందుకు షెడ్లను ఏర్పాటు చేశారు. డీసీపీ పద్మజ పర్యవేక్షణలో 34 మంది పోలీస్‌ అధికారులు, 400 మంది పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ మొదటిసారిగా దర్గాను దర్శించుకోవడంతో అక్కడ సందడి నెలకొంది.

సీఎం కేసీఆర్‌ పర్యటనలో అపశృతి..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం షాద్‌నగర్‌ మండంలోని ప్రసిద్ధ జహంగీర్‌పీర్‌ దర్గాను సీఎం కేసీఆర్‌ సందర్శించుకోవడానికి వెళ్తుతుండగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వాహనం కానిస్టేబుల్‌ను ఢీ కొన్నది. ఈ ఘటనలో కీసర పొలీసుస్టేషన్‌కు చెందిన రవి కిరణ్‌కు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై హుటాహుటిన స్థానిక ఆస్పత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం రవికిరణ్‌ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.