ఉమ్మడి రాష్ట్రం కన్నా అధ్వాన్నంగా ప్రభుత్వ తీరు
డీరల్ల సంఘం నేతల మండిపాటు
కరీంనగర్,డిసెంబర్2(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోనైనా డీలర్ల సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే ఉమ్మడి రాస్టంలో కన్నా పరిస్తితి అధ్వాన్నంగా తయరయ్యిందని డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ అన్నారు. తెలంగౄణ ఏర్పడి మూడేళ్లయినా తమను కనీసం చర్చలకు పిలువకుండా తొలగిస్తామనడం అప్రజాస్వామికం కాక మరోటి కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆందోళనలు చేస్తున్నాం. ధర్నాలు చేయడం వినతిపత్రాలు ఇవ్వడం సాధారణమైపోయిందని అన్నారు. కానీ డిమాండ్లను మాత్రం నెరవేర్చడం లేదన్నారు. ప్రభుత్వ ఉపశమన మాటలతో విసిగి వేసారమని, కాలయాపన ఇంకెన్నాళ్లంటూ డీలర్లు మండిపడుతున్నారు. గత నెల 23లోపే డీడీలు కట్టాల్సిన డీలర్లు కట్టకపోవడంతో సరకుల పంపిణీ సందిగ్ధంలో పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి డీలర్లను తొలగించాలని
అధికారులను ఆదేశించడంతో వారు మండిపడుతున్నారు. సమస్యను పరిష్కిరంచడం,చర్చించడం వదిలి తొలగిస్తారా అని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీడీలు కట్టని డీలర్లను తొలగించాలని స్పష్టం చేయగా కేవలం 36 మంది మాత్రమే డీడీలు కట్టినట్లు సమాచారం. ఇందులో డీసీఎంఎస్, స్వశక్తి సంఘాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా డీలర్లంతా డీడీలు కట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు వారి వారి స్థాయిల్లో డీలర్లతో మాట్లాడగా డీడీలు కట్టమని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ-పాస్ విధానంలో సరకుల పంపిణీ జరుగుతుండగా ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించి యంత్ర నిర్వహణపై శిక్షణనివ్వాలంటే కనీసం వారం రోజులైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా అలాట్మెంట్ తదుపరి 25 తేదీలోగా డీలర్లు డీడీలు కట్టిన తదుపరి మండలస్థాయి నిల్వ కేంద్రాల నుంచి రేషన్ దుకాణాలకు సరకులు రవాణా చేస్తారు. నెల చివరిలోగా సరకులను సరఫరా చేయాల్సి ఉంటుంది. అనంతరం ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. డీలర్లు డీడీలు కట్టనపుడు సరకులను పంపిణీ చేయకపోగా నిల్వకేంద్రాల్లో పేరుకుపోనున్నాయి. అలాగని అధికార యంత్రాంగం ద్వారా సరకులను పంపిణీ చేయాలంటే అసాధ్యం అంటున్నారు. తమను కాదని తమ సమస్యలపై దృష్టి పెట్టకుండా కర్రపెత్తనం చేయడం తగదన్నారు.