ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు


ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం
హైదరాబాద్(జనంసాక్షి):సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తాజాగా బీఆరఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక వాస్తవాలు సంతోష్ రావుకు తెలిసి ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, విచారణ నిమిత్తం జనవరి 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జుబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో స్వయంగా హాజరు కావాలని జుబ్లీహిల్స్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. వెంకటగిరి ఆదేశించారు. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను విచారించిన సంగతి తెలిసిందే. ఐటీ చట్టం, ప్రభుత్వ ఆస్తుల నష్టం నిరోధక చట్టం వంటి కఠిన సెక్షన్ల కింద కొనసాగుతున్న ఈ విచారణలో సంతోష్ రావుకు నోటీసులు అందడం రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది. రేపు మధ్యాహ్నం జరగబోయే ఈ విచారణలో సిట్ అధికారులు సంతోష్ రావు నుండి ఎటువంటి సమాచారాన్ని రాబడతారనే అంశంపై ఇప్ప్పుడు హాట్ టాపిక్ గా మారింది.