ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉంది

బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ వెల్లడి
బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో జాన్వీ కపూర్‌ ఒకరు. అందాల తార శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమా ’ధడక్‌’తోనే ప్రశంసలు అందుకుంది. అనంతరం కూడా వరుసగా కంటెంట్‌ ఉన్న సినిమాలు చేస్తూ అందంతోపాటు అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఈ బ్యూటీ తాజా నటించిన చిత్రం ’గుడ్‌లక్‌ జెర్రీ 2018లో నయనతార ప్రధాన పాత్రలో నటించని తమిళ హిట్‌ సినిమా ’కొలమావు కోకిల’కి ఇది రిమేక్‌. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌ ఎంట్రీపై జాన్వీ స్పందించింది.
ఎన్టీఆర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రానున్న విషయం తెలిసిందే. ’ఎన్టీఆర్‌ 30’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా ఇంకా ఎవరినీ ఫైనల్‌ చేయలేదు. కానీ.. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనిపై జాన్వీ స్పందిస్తూ.. ’నేను సౌత్‌ సినిమాల గురించి చాలా ఓపెన్‌గా ఉండాలనుకుంటున్నాను. నాకు నిజంగా టాలీవుడ్‌ ఫిల్మ్‌ లేదా ఏదైనా సౌత్‌ సినిమా చేయాలనే ఆసక్తి ఉంది. ఎన్టీఆర్‌ సర్‌తో కలిసి పని చేసే అవకాశం రావడమంటే మాటలు కాదు. ఆయన ఓ లెజెండ్‌. ఆ రూమర్‌ నిజమైతే నా అంతా అదృష్టవంతురాలు ఉండరు.. కానీ దురదృష్టవశాత్తూ.. ఆ సినిమా నుంచి ఏ ఆఫర్‌ నాకు రాలేదు. నేను ప్రస్తుతం మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. అలాగే..తమిళ సినిమాలో కూడా అరంగేట్రం చేయాలనే కోరికను తెలియజేస్తూ.. ’మణిరత్నం సర్‌ చిత్రాల తరహాలో ఓ క్లాసిక్‌ సినిమా చేయాలనుకుంటున్నాను. అందులో.. ఐశ్వర్య రాయ్‌లాగా చాలా సాధారణ దుస్తులతో పర్వతాలు, జలపాతం చుట్టూ తిరుగుతుండాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో రెహమాన్‌ పాట ప్లే అవుతూ ఉండాలి. ఆ సీన్స్‌లో చాలా ఎమోషన్‌ ఉంటుంది’ అని జాన్వీ తెలిపింది. కాగా.. జాన్వీ ప్రస్తుతం రాజ్‌కుమార్‌ రావుతో కలిసి ’మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’, సన్నీ కౌశల్‌తో కలిసి మలయాళం చిత్రం ’హెలెన్‌’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ’మిలీ’, వరుణ్‌ ధావన్‌తో కలిసి ’బవాల్‌’ చిత్రం చేస్తోంది.