ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకే మద్దతు

తెబొగకాసం నేతల ప్రకటన

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే టీబీజీకేఎస్‌ మద్దతు ఉంటుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు తెలిపారు. ఎవరు రంగంలో ఉన్నా వారినే గెలిపిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం టీబీజీకేఎస్‌ పని చేస్తుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి రాజిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా కృషి చేయాల్సిందిగా సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశానుసారం కార్మిక సంఘంలో విభేదాలు లేకుండా.. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల విజయం మా బాధ్యతగా భావించి.. సింగరేణి కార్మిక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నట్లు వివరించారు. సింగరేణి అభివృద్ధి కోసం, కార్మిక సంక్షేమం కోసం పనిచేసిన కేసీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేయాలని టీబీజీకేఎస్‌ ఎన్నికల ప్రచారం చేస్తుందని తెలిపారు. ఆరు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి కార్మిక వర్గానికి ఏవిూ చేయలేదని విమర్శించారు. టీబీజీకేఎస్‌ కొద్దికాలంలోనే.. సింగరేణి అభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి కృషి చేసిందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి కేసీఆర్‌ కు అండగా నిలవడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వం కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు.