కలెక్టరేట్ ఎదుట బిసీ పొలిటికల్ జేఏసీ ధర్నా.

పాత మార్కెట్ యార్డు స్థలంలో బీసీ సంక్షేమ వసతిగృహాలను నిర్మించాలని డిమాండ్.
అదనపు కలెక్టర్ కు వినతిపత్రం.
బిసీ విద్యార్థులపై చిన్న చూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
బిసి పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్23(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న అతిథి గృహం స్థలంలో అన్ని వసతులతో కూడిన బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్మాణాలు చేపట్టాలని బిసి పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి అన్నారు. శుక్రవారం జాతీయ బిసీ విద్యార్థి సంక్షేమ సంఘం మరియు బిసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బిసీ వసతి గృహాల విద్యార్థుల తో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు.ఈ సందర్భంగా అరవింద్ చారి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పట్టణంలో గల పాత మార్కెట్ యార్డులో చేపడుతున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు నిలుపుదల చేసి అట్టి స్థలంలో అన్ని వసతులతో కూడిన బీసీ వసతి గృహాలను నిర్మించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నూతన జిల్లాల ఏర్పాటు జరిగినప్పటికీ విద్యా వ్యవస్థ లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు వసతిగృహాలు అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాలు ఉండాలని పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని విచారం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం బిసీ విద్యార్థులపై చిన్న చూపు చూస్తుందని, విద్యారంగం పై నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. బీసీ వసతి గృహాలను అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులకు కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా వసతిగృహాల్లోని విద్యార్థులకు మూత్రశాలలు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో తరచుగా అనా రోగ్యానికి గురవుతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని అతిథిగృహ స్థలంలో కొందరు మటన్ దుకాణం,చికెన్ దుకాణం, కూర గాయల మార్కెట్ ను నిర్మిస్తున్నారని అర్థం కాని పరిస్థితిలో ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు.ధర్నా అనంతరం వివిధ డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ కు మోతిలాల్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో మహేష్ బాబు,శివకుమార్, గణేష్, కుమార్, శ్రీకాంత్, ఆనంద్, మోహన్, లక్ష్మణ్, సైదులు, సతీష్, రామాంజనేయులు,రాజు, నరేందర్, ఆంజనేయులు, మల్లేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.