కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

కూటమిని తరిమి కొట్టాలి : గొంగిడి మహేందర్‌రెడ్డి

యాదాద్రి,నవంబర్‌24(జ‌నంసాక్షి): కేసీఆర్‌తోనే మనం కలలు కన్న బంగారు తెలంగాణ సాధ్యమని, పూటకో మాట చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్న దొంగ కూటమిని తరిమికొట్టాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆసరా, ఆహార భద్రత, రైతు బీమా, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఘనత కేవలం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గొంగిడి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు తెలంగాణ ప్రాంతానికి ఒరగబెట్టిందేవిూ లేదన్నారు. కేసీఆర్‌ కేవలం నాలుగున్నరేళ్లలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. సీమాంధ్రుల పాలనలో మన తెలంగాణ చెరువులు మట్టితో కూరుకుపోతున్న తరుణం లో మహాయజ్ఞంతో పూడికతీత పనులు చేపట్టారన్నారు. స్వచ్ఛమైన తాగు నీటిని అందించాలని లక్ష్యంతో మిషన్‌ భగీరథ పథకం చేపట్టి పనులు వేగంగా చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక దొంగ కూటమిగా నాయకులు అందరూ ఒక్కటై కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ పక్షానే ప్రజలు ఉంటారన్నారు.