కొడుక్కి పట్టాభిషేకం చేసేందుకే.. కేసీఆర్‌ ముందస్తుకు

– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు

– ప్రత్యక్షంగా ఎంఐఎంతో, పరోక్షంగా బీజేపీతో కేసీఆర్‌ పొత్తు

– కొడంగల్‌ ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆరే

– ఓడిపోతే అమెరికాపోయే కేటీఆర్‌.. కొడంగల్‌ దత్తత తీసుకొని ఏం చేస్తావ్‌?

– నేటి రాహుల్‌ గాంధీ పర్యటనను విజయవంతం చేయండి

– రాహుల్‌గాంధీ రావడం అభివృద్ధికి సూచిక

– విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి) : కుటుంబ ఒత్తిడి తట్టుకోలేక, కొడుకు కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. గతంలో అసెంబ్లీని రద్దుచేసే ముందు ఎందుకు రద్దు చేస్తున్నామో కారణాలు చెప్పి, ప్రజలకు తెలియజేసి రద్దు చేసేవారని, కానీ కేసీఆర్‌ రాజ్యాంగంపై నమ్మకం లేదని విమర్శించారు. కొడుకును రాజును చేసేందుకే కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచడం కోసం కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. 52నెలల పాలనలో ఉద్యమకారుల ఆకాంక్షలపై ఆలోచన చేయలేదని కేసీఆర్‌ పాలన తీరుపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ కుటుంబకూటమి అని, ప్రత్యక్షంగా ఎంఐఎంతో, పరోక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు.

కుటుంబ కూటమి, ప్రజాకూటమి మధ్య పోటీ జరుగుతోందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెరాస విూద కేసీఆర్‌ నమ్మకం, విశ్వాసం కోల్పోయారని అన్నారు. కేసీఆర్‌ విచక్షణతో మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం కొస్గీలో రాహుల్‌గాంధీ ప్రచారానికి వస్తున్నారని, రాహుల్‌ గాంధీ రావడం అభివృద్ధికి సూచిక అని, రాహుల్‌ గాంధీకి అఖండ స్వాగతం పలుకుదామని రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొడంగల్‌ ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆరేనని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. రైల్వే లైన్‌ దస్త్రాన్ని తొక్కిపెట్టి మా ప్రాంత అభివృద్ధిని అడ్డకున్నాడని అన్నారు. కొడంగల్‌లో కనీస అభివృద్ధికి కూడా సహకరించలేదని అన్నారు. ఓడిపోతే పారియోటోడివి.. కొడంగల్‌ దత్తత తీసుకొని ఏం చేస్తావంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. సిరిసిల్ల కార్మికుల ముసుగులో రూ.50, రూ.60 చీరలు పంచిపెట్టారని, కేసీఆర్‌ అవినీతిని బయటపెడుతున్నందుకే నన్ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ అన్నారు. అంబేద్కర్‌ సాక్షిగా కేటీఆర్‌.. గురున్నాథ్‌రెడ్డిని అవమానించారని, గురున్నాథ్‌రెడ్డికి జరిగిన అవమానం కొడంగల్‌ ప్రజలకు జరుగుతున్నదే నని రేవంత్‌ అన్నారు. కొడంగల్‌లో ఓడిపోతే కేటీఆరే కాదు.. నరేందర్‌రెడ్డి కూడా పారిపోతాడని, కొడంగల్‌లో నేనే ఎళ్లకాలం ఉంటానని, ఇటువైపు ఎవరూ చూడరని అన్నారు. కూటమి పార్టీల్లోని కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి ఎన్నికల్లో ఓటుతో తెరాసకు బుద్ది చెప్పాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.