కొత్తపంచాయితీలకు నవ్యశోభ

నేటినుంచే అమల్లోకి పంచాయితీ కార్యాలయాలు
భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): సర్పంచలకు కాలం చెల్లింది. ఇక వారి ఏలుబడి పూర్తయ్యింది. ఐదేళ్లుగా వారు చేపట్టిన పాలన బుదవారంతో ముగియడంతో గురువారం నుంచి పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల పాలనరానుంది. అలాగే తండాలను పంచాయితీలుగా మార్చడంతో అక్కడా ప్రత్యేకాధికారులతో పాలన సాగనుంది. దశాబ్దాల కల నిజం చేస్తూ ప్రభుత్వం తండాలను పంచాయితీలుగా మార్చింది. దీంతో ఆగస్టు 2వతేదీ నుంచి నూతన పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాల్లో పండుగ వాతావరణంలో పాలన ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లలో జిల్లా పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన 167 పంచాయతీల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి పాలన ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 417 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 167 ఆవాస గ్రామాలను నూతన పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంగా ఖమ్మం జిల్లాలోని 20 గ్రావిూణ మండలాల్లో 584 పంచాయతీలు ఉన్నాయి.అలాగే పాలనకు అనుకూలంగా గుర్తించిన భవనానికి సున్నం వేయడంతో పాటు గ్రామ పంచాయతీ పేరు, మండలం, జిల్లా, రాష్ట్రం, పిన్‌కోడ్‌తో ఆ భవనానికి పేర్లను తెలుగులో రాయిస్తారు. జీపీలకు అవసరమైన నూతన రికార్డుల ప్రారంభంతో పాటు నూతన ఫర్నిచర్‌, అవసరమైన స్టాంపులు సిద్ధం చేశారు. ప్రజలకు తమ గ్రామానికి ఉన్న సరిహద్దులను తెలియజేసేవిధంగా గ్రామపటాన్ని అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల నుంచి నూతనంగా విడిపోయిన గ్రామాలకు జనాభా లెక్కల ప్రకారం ఆస్తులు, అప్పులను పంపకం చేశారు.