” గచ్చిబౌలి డివిజన్ ను మార్గదర్శకంగా నిలబెడతా – డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు  22( జనంసాక్షి): గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పరంగా తీర్చిదిద్ది లింగంపల్లి నియోజకవర్గంలోనే మార్గదర్శకంగా నిలబెడతానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం డివిజన్ పరిధి ఎన్టీఆర్ నగర్ లో స్థానికులతోకలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగానెలకొన్న సమస్యలనుగూర్చి కాలనీవాసులు ఏకరువుపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ కాలనీ పరిధిలో  ప్రధానంగా నెలకొన్న సమస్యలలో భూగర్భ డ్రైనేజీకి సంబంధించి ఉత్పన్నమవుతున్నాయని, కాలనీ పరిధిలో భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ల లో ఎక్కడికక్కడ మట్టి పేరుకుపోవడంవల్ల బిక్షపతి నగర్ లోని పలు రోడ్లపైన మురుగు నీటి సమస్య తలెత్తుతుందన్నారు. గచ్చిబౌలి డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తామని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కార్పొరేటర్ గా తనకు ఎప్పుడైనా సరే సమస్యలను వివరిస్తే తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలో మౌలిక వసతులైన రక్షిత మంచినీరు, నాణ్యమైన విద్యుత్తు, మెరుగైన రోడ్లు, లీకేజీలు లేని యూజీ పైపులైన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి డివిజన్ ప్రజలకిచ్చిన హామీలను 100% నెరవేరుస్తామని గంగాధర్ రెడ్డి ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు కృష్ణ, శ్రీశైలం, మధు, జిలాని, సురేష్, ఎన్టీఆర్ నగర్ కాలనీవాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.