గింత మురికి వాడల్లో ప్రజలెట్ల బతుకుతరు

Untitled-2
అధికారులపై సీఎం గుస్సా

పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు

వరంగల్‌,జనవరి8(జనంసాక్షి): వరంగల్‌లోని మురికి వాడలను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం స్వయంగా పరిశీలించారు. ఆ పరిస్థితి చూసి ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. ఇలాంటి మురికి వాడలలో ప్రజలు ఎలా ఉంటారు ? అని అధికారులను నిలదీశారు. వరంగల్‌ నగరంలోని మురికివాడల వాసులకు  సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హావిూ ఇచ్చారు. కెసిఆర్‌ మాట ఇస్తే తప్పడని, గతంలో ఉన్న సిఎంల లాగా కెసిఆర్‌ ఉండడని అన్నారు. మురకివాడల్లో ప్రజలు పడుతున్న అవస్థలను స్వయంగా పరిశీలించారు. మురికివాడల్లో ఉన్న పరిస్థితులపై జిల్లాకలెక్టర్‌, నగరపాలకసంస్థ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని పేదలకు రెండు బెడ్‌రూమ్‌ల గృహాలు నిర్మిస్తామని హావిూనిచ్చారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వున్నారు. తన వరంగల్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ఔదార్యాన్ని ప్రదర్శించారు. నగరంలోని కాశిబుగ్గలో ఉన్న లక్ష్మీపురం మురికి వాడలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ అంబి కొమురం, అంబి సమ్ములు గుడిసెలకు వెళ్లారు. అంబి సమ్ములు గుడిసెలో 20 నిమిషాలపాటు సీఎం గడిపారు. వారి బాగోగులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.  వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగింది. తాకరాజుకుంట, లక్ష్మీనగర్‌, వెంకట్రామాజంక్షన్‌ లోని స్లమ్‌ ఏరియాల్లో సీఎం పర్యటించాన్నారు. వరంగల్‌ నగరంలో చాలా మురికి వాడలు ఉన్నాయని సీఎం అన్నారు. పర్యటనలో భాగంగా ఆయన కాశిబుగ్గలో ఉన్న లక్ష్మీపురం, భగత్‌సింగ్‌నగర్‌, గిర్మాజీపేట మురికి వాడలను పరిశీలించారు. మురికి వాడల్లో నివసిస్తోన్న ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బస్తీల్లోని సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. నగరంలోని అన్ని మురికి వాడల్లో గుడిసెలు తొలగించి వన్‌ ప్లస్‌ వన్‌ ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం హావిూ ఇచ్చారు. ఒక్కో ఇంట్లో రెండు బెడ్‌ రూములు, హాల్‌, కిచెన్‌, రెండు బాత్‌ రూమ్‌లు, రెండు లాట్రీన్‌లు నిర్మింపజేస్తామని వెల్లడించారు. నగరంలోని బస్తీల్లో దళిత, ముస్లిం, కైస్త్రవ ఇతర కులాల వారు ఉన్నారని కేసీఆర్‌ తెలిపారు. వరంగల్‌లోని ప్రతీ మురికివాడను అధికారులు వచ్చి పరిశీలిస్తారని తెలిపారు. కెసిఆర్‌ మాట ఇస్తే తపస్పడని అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అన్నారు. అధికారులే విూ దగ్గరకు వచ్చి వివరాలు తీసుకుంటారని అన్నారు. మంత్రులు రాజయ్య, చందూలాల్‌, ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, కొండా సురేఖ ఎంపీ నాయక్‌ తదితరులు వెంట ఉన్నారు. శుక్రవారం అర్చక సమాఖ్య సమావేశంలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. భూపాలపల్లి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించనున్నారు.