మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD) ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని తెలిపింది. మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ పేర్కొన్నారు. 2023 తరువాత ఉష్ణోగ్రతల పరంగా ఫిబ్రవరి 2025 రెండవ అత్యంత వేడిగా నమోదైందని ఆయన తెలిపారు.

దేశంలో 1901 తర్వాత ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదైందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మొదటిసారి సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని ఆయన తెలిపారు. 124 ఏళ్ల తర్వాత అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరిగా ఇది నమోదైందని ఆయన వెల్లడించారు.