గ్రావిూణ రోడ్లకు ఎంపి,ఎమ్మెల్యే నిధులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వనిర్ణయంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛిద్రమైపోయిన గ్రావిూణ అంతర్గత రోడ్ల వ్యవస్థ సమూలంగా మారిపోనుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం సీసీ రోడ్లు నిర్మాణం కానున్నాయి. గతంలో ఎంపిక చేసిన కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ పథకం ఇక వాడవాడలా అమలయ్యే అవకాశం ఉంది. నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాల కోసం జిల్లా పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ విస్తృత సర్వేను చేపట్టింది.ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధులను కూడా దీనిపై వినియోగించనున్నారు. యుద్ధప్రాతిపదికన ఆ శాఖాధికారులు.. సిబ్బంది, సర్పంచ్‌లు, ఎంపీటీసీల ద్వారా సమాచారాన్ని సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామాలను ఎంపిక చేసి ప్రణాళికలు తయారు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటికి గతంలో పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ నిధులను మాత్రమే వినియోగించేవారు. ఇప్పుడు ఈ విధానాన్ని సమూలంగా మార్పు చేయనుంది. ఒక్కో గ్రామంలో అన్ని కాలనీలూ పూర్తి స్థాయిలో సిమెంట్‌ రోడ్ల మయం కానున్నాయి. దీనికి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు వేసి మార్గదర్శకాలను రూపొందించనుంది. ఒక పక్క రోడ్డు వేస్తుంటే.. మరో పక్క వివిధ పనుల కోసం మళ్లీ ఆ రోడ్డును తవ్వుతుంటారు. ఇలాంటి సమయాల్లో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. దీనిని అధిగమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతోంది. రోడ్డు నిర్మాణ సమయంలోనే కొంత వెసులుబాటును ఇవ్వనుంది. పైపులైన్లు తదితరాలు వేసుకునేందుకు రోడ్డు నిర్మాణంలోని ప్రతి 50 అడుగులకూ ఒక చోట రింగులను ఏర్పాటు చేయనుంది.