ట్యాంకర్లతో నీటిని అందిస్తున్న పంచాయతీ
చండ్రుగొండ జనంసాక్షి (జులై 17) : మండల కేంద్రమైన చండ్రుగొండలో గత వారం రోజులుగా భగీరథ నీరు రాకపోవడంతో పంచాయితీ ప్రజల సమస్యలను వారు పడే ఇబ్బందులను జనంసాక్షి గుర్తించింది. ” భగీరథ నీళ్ల అంతరాయం మాట సరే ప్రత్యామ్నాయం చూపరా..? “అంటూ శుక్రవారం జనం సాక్షి లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు.తక్షణం ప్రత్యామ్నాయ మార్గంగా పంచాయతీలోని మోటార్లను రిపేర్ చేయించేందుకు ప్రయత్నం చేశారు. రిపేర్ పనులు పూర్తయ్యేందుకు సమయం పడుతుందని భావించిన అధికారులు ఆదివారం ట్యాంకర్లతో నీటిని అందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం చేశారు. పాలకుల నిర్ణయాన్ని పంచాయతీ ప్రజలు స్వాగతించారు.అయితే పంచాయితీ మొత్తానికి ఒకే రోజులో నీటిని సరఫరా చేయడం కాస్త ఇబ్బందిగా మారిందని పంచాయతీ సెక్రెటరీ ఉపేందర్ తెలిపారు. అందరికీ నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భగీరథ నీళ్లు వచ్చే వరకు ఇబ్బందిగా ఉంటుందని ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిని పొదుపుగా వాడాలని ఆ విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఇదిలావుంటే గోదావరి వరదల వల్ల భగీరథ నీళ్లు బురదమయంగా వచ్చే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వచ్ఛమైన తాగునీరు వచ్చేవరకు నీటి సరఫరా చేయాలని పంచాయితీ ప్రజలు అధికారులను కోరుతున్నారు.