తల్లిని చంపిన తనయుడు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): క్షణికావేశంలో ఓ వ్యక్తి తల్లిని కొట్టి చంపిన ఉదంతం శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. వనపర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పేటకు చెందిన జంగిడి కుర్మయ్య(55), అక్కమ్మ(50) భార్యభర్తలు కాగా వారికి నలుగురు సంతానం ఉన్నారు. పెద్ద కుమారుడు శేఖర్‌ గ్రామంలో పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం తల్లి అక్కమ్మను పశువుల కాపలాకు వెళ్లమని శేఖర్‌ అడిగడంతో తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. ఒక్కసారిగా క్షణికావేశానికి గురైన శేఖర్‌ తల్లిని తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.