తెలంగాణకోసం పార్లమెంటు స్తంభన : బీజేపీ

నల్గొండ: వచ్చేనెల 9 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ ఎంపిలు పార్లమెంటును స్తంభింపజేస్తారని పార్టీ రాష్ట్ర నేత  బి. దత్తాత్రేయ చెప్పారు. కోదాడ నుంచి ఈ నెల 26న ఎబివిపి కార్యకర్తలు ప్రారంభించిన మహాపాదయాత్ర శుక్రవారం నల్గొండకు చేరింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ వారినుద్దేశించి ప్రసంగిస్తూ 2009లో ఇదే రోజు కేంద్రం తెలంగాణ ప్రకటన చేపినప్పటికీ సీమాంధ్రనేతలు అడ్డుకున్నారని చెప్పారు. తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణ సెంటిమెంటుపైడ్రామాలు ఆడుతున్నారన్నారు. జైపాల్‌రెడ్డి లాటి తెలంగాణ మంత్రులు సోనియాగాంధీపై తెలంగాణ కోసం ఒత్తిడి తేవాలి అని కోరారు. కిరణ్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, టీడీపీ వైఎస్సార్సీలు ప్రజలను మోసగించేందుకు పాదయాత్రలు ప్రారంభించాయని టీడీపీ తెలంగాణపై స్పషకటమైన వైఖరి చూపటం లేదని చెప్పారు. జైలులోని జగన్‌ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రకటన చేయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే జిల్లాలో ప్లోరైడ్‌ సమస్య పరిష్కృతం అవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయనేత శ్రీరామ్‌ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రామ్‌ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.