తెలంగాణ అమరవీరులను ఎందుకు పరామర్శించలే

యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం
జవాన్‌ కుటుంబాన్ని పరామర్శించిన బాబు
మహబూబ్‌నగర్‌, జూలై 1 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరుతూ ఆత్మబలిదానాలకు పాల్పడ్డ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించని చంద్రబాబునాయుడు ఎట్టకేలకు ఓ అమరుడి కుటుంబాన్ని మాత్రం పరామర్శించారు. శ్రీనగర్‌లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన యాదయ్య కుటుంబ సభ్యులను చంద్రబాబు సోమవారం పరామర్శించారు. అతడి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్‌ యాదయ్య గత వారం శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం కొండారెడ్డిపల్లికి వచ్చిన చంద్రబాబు.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జవాన్లపై ఉగ్రవాద దాడులు జరగడం బాధాకరమన్నారు. ఉగ్రవాద దాడులకు గురైన సైనికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే యాదయ్య కుమార్తెలు ఇద్దరిని తాము చదివిస్తామన్నారు.