నల్గొండలో దారుణం

– పట్టపగలే యువకుడిని కత్తితో నరికిన వ్యక్తి
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నల్లగొండ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) :నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారునం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని పట్టపగలే దారుణంగా హత్యచేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి ఆస్పత్రి వద్ద పట్టపగలే దారుణ హత్య జరిగింది. మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్లు ప్రణయ్‌ అనే యువకుడు అదే పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్‌ కుమార్తె అమృతను ప్రేమించి ఇటీవలే వివాహం చేసుకున్నాడు. అయితే అమృత గర్భిణీ కావడంతో.. జ్యోతి ఆస్పత్రికి తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రణయ్‌పై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో నరికి చంపాడు. తల, మెడపై బలంగా కత్తితో నరకడంతో.. అక్కడికక్కడే ప్రణయ్‌ ప్రాణాలొదిలాడు. ఇక ప్రణయ్‌ భార్య అమృత, మరో మహిళ భయంతో పరుగులు పెడుతూ తిరిగి ఆస్పత్రిలోకి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమృత తండ్రే తన కొడుకును హత్య చేయించాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.